డాక్టర్ సుధాకర్‌ను మా ఎదుట హాజరుపరచండి : హైకోర్టు ఆర్డర్

మంగళవారం, 19 మే 2020 (12:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేసి సస్పెండ్‌కు గురైన డాక్టర్ సుధాకర్‌ను తమ ముందు హాజరుపరచాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. జైల్లో ఉన్న తన కుమారుడిని చూసేందుకు పోలీసులు, జైలు అధికారులు అనుమతించడం లేదంటూ సుధాకర్ తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు మేరకు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. అలాగే, సుధాకర్ తల్లి చేసిన ఆరోపణలపై కూడా కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ సర్కారును ఆదేశించింది. అలాగే, వీరారెడ్డిని అనే వ్యక్తిని అమికస్ క్యూరీగా హైకోర్టు నియమించింది. 
 
కాగా, ఇటీవల వైజాగ్ పోలీసులు డాక్టర్ సుధాకర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన విషయం తెల్సిందే. మద్యం సేవించి జాతీయ రహదారిపై నానా యాగీ చేస్తున్నారనీ, పలువురిపై చేయి చేసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ముఖ్యంగా, డాక్టర్ సుధాకర్ చేతులు వెనక్కి విరిచి కట్టేసి, గుండు చేయించి రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో విజువల్స్ మీడియాలో ప్రసారమయ్యాయి. 
 
ఇదే అంశంపై టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా హైకోర్టుకు ఓ లేఖ రాశారు. డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసులు, ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని సుమోటాగా స్వీకరించాలని ఆమె కోరారు. ఈ నేపథ్యంలో సుధాకర్ తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. బాధిత వైద్యుడిని తమ ముందు హాజరుపరచాలని ఆదేశించింది. 
 
కాగా, నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో వైద్యుడుగా పని చేస్తూ వచ్చిన డాక్టర్ సుధాకర్ ఏపీ సర్కారుపై సంచలన ఆరోపణలు చేశారు. కరోనా రోగులకు వైద్యం చేసేందుకు కనీసం ఎన్-95 రకం మాస్కులు, పీపీఈ కిట్లు కూడా ఇవ్వడంలేదంటూ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం డాక్టర్ సుధాకర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు