ఆరుబ‌య‌ట ఎవ‌రూ తాగ‌కుండా చూస్తాం: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

గురువారం, 23 సెప్టెంబరు 2021 (14:01 IST)
ఆంధ్రప్రదేశ్ లో బహిరంగ మద్య సేవనంపై ఉక్కు పాదం మోపి తద్వారా మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు, దోపిడీలు, ఘర్షణలను నివారించడానికి ప్రత్యేక కృషి చేస్తామని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. తాడేపల్లిలోని రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిశారు. 
 
ఆంధ్రప్రదేశ్ లో బహిరంగ మద్యం సేవనం గణనీయంగా పెరిగిందని, దీనిని నిర్మూలించడానికి ప్రత్యేక కృషి జరగాలని మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి కోరారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దుర్ఘటనలు, ఘర్షణలకు బహిరంగ మద్య సేవనం ప్రధాన కారణమని వివరించారు. చట్టాలలో మార్పు తెచ్చి బహిరంగ మద్య సేవనంపై కఠిన చర్యలు చేపట్టే విధంగా కృషి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వ‌ల్లంరెడ్డి వివ‌రించారు. 
 
దీనినై డీజీపీ గౌతం స‌వాంగ్ స్పందిస్తూ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ను మరింత పటిష్టం చేయడం ద్వారా నాటు సారా, అక్రమ మద్యం, గంజాయి లాంటి మత్తు పానీయాలను నివారించగలమని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అవసరమైన చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా బహిరంగ మద్య సేవనాన్ని నివారించగలమని తెలిపారు.

గ్రామ/ వార్డు సచివాలయలలో పని చేస్తున్న మహిళ పోలీసులకు యూనిఫామ్ అందించి, వారి ఉద్యోగ  నియమావళిలో బహిరంగ మద్య సేవనాన్ని  నిర్ములంచడం ఒక బాధ్యతగా పేర్కొనాలని వ‌ల్లంరెడ్డి సూచించారు. దీనిపై రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందిస్తూ, ప్రభుత్వ ధ్యేయమైన మద్య రహిత సమాజంలో భాగంగా, మద్య నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెడతామని హామీ ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు