దిశ పోలీస్ యాప్‌ను కొనియాడిన ఒలింపిక్ విజేత సింధు

శనివారం, 14 ఆగస్టు 2021 (12:21 IST)
ఏపీ డీజీపి కార్యాలయం పి.వి.సింధు కుటుంబాన్ని అభినంద‌న‌ల‌తో ముంచెత్తింది. డి‌జి‌పి గౌతం సవాంగ్ ను ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత పి వి సింధు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. టోక్యో ఒలింపిక్స్‌లో సాధించిన కాంస్య పతకాన్ని తిలకించిన డీజీపి గౌతం స‌వాంగ్ ఆమెను అభినందించారు.

మన రాష్ట్రానికి చెందిన సింధు ప్రపంచ స్థాయి లో పతకం సాధించడం ఆంధ్ర ప్రదేశ్ కు దక్కిన గౌరవం అన్నారు. ఆమె సాధించిన విజయం మహిళలకు, యువతకు ప్రేరణ, స్ఫూర్తిగా నిలుస్తుంద‌ని, సింధును చూసి మ‌రెంద‌రో క్రీడ‌ల్లో రాణించ‌గ‌ల‌ర‌ని అన్నారు.

రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించి దేశం, రాష్ట్ర యొక్క కీర్తిప్రతిష్టలు ఇనుమడింప జేయాలని డి.జి.పి. ఆకాంక్షించారు. పివి.సింధు, తల్లిదండ్రులను శాలువాతో సత్కరించిన డి‌జి‌పి, పలువురు పోలీస్ ఉన్నతాధికారులు వారికి అభినంద‌న‌లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ఏపి ప్రభుత్వం, పోలీస్ శాఖ మహిళల కోసం చేస్తున్న కృషిని పి వి.సింధు కొనియాడారు. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతి మహిళ దిశ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవాలని పి వి.సింధు కోరారు. .

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు