తిరుమలలోనే రెచ్చిపోయిన స్మగ్లర్లు, శ్రీవారి ఆలయం వెనుకే..?

బుధవారం, 25 ఆగస్టు 2021 (21:10 IST)
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో ఎర్రచందనం కూలీల తిరగడం కలకలం రేపుతోంది. అడవిలో దారి తప్పి శ్రీవారి ఆలయం వెనుక వైపు ఉన్న మ్యూజియం దగ్గరకు నలుగురు ఎర్రచందనం కూలీలు చేరుకున్నారు.
 
ఫేస్ రికగ్నైజ్డ్ కెమెరాలు ఈ ఎర్రచందనం కూలీలను పట్టించాయి. సీసీ కెమెరాల్లో గమనించి అప్రమత్తం చేయడంతో దగ్గరలోని భద్రతా సిబ్బందిని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సిబ్బంది అప్రమత్తం చేశారు. 
 
నలుగురు ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకుని వారిని ప్రశ్నించారు. నలుగురిని ప్రశ్నించగా వారు ఇచ్చిన సమాచారంతో మరో ఐదుగురి కోసం అటవీశాఖ అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరి దగ్గర నుంచి 10 లక్షల రూపాయల విలువ చేసే ఎర్రచందనం దుంగలను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
 
భద్రతా చర్యల్లో భాగంగా అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎర్రచందనం కూలీలను ప్రశ్నించగా రామక్రిష్ణ తీర్థం దగ్గర ఎర్రచందనం నరికినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దారి తప్పి పొరపాటున మ్యూజియం వైపు వచ్చినట్లు వివరించారు.
 
అయితే తిరుమలలోని శ్రీవారి ఆలయానికి సరిగ్గా వెనుక వైపునే ఎర్రచందనం స్మగర్లు కనిపించడం.. వారిని పట్టుకోవడం కలకలం రేపుతోంది. వీరి వెనుక ఉన్న స్మగ్మర్ల కోసం టాస్క్ ఫోర్స్ గాలిస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు