నిన్నటివరకు రివర్స్ టెండరింగ్ డ్రామాలు.. ఇప్పుడు రీఇంజనీరింగ్ నాటకాలా

గురువారం, 10 డిశెంబరు 2020 (07:51 IST)
జగన్మోహన్ రెడ్డి కొత్తసంప్రదాయానికి తెరలేపారని, గతంలో చంద్రబాబు ప్రభుత్వం ముక్త్యాల ఎత్తిపోతల పథకాన్ని, జగ్గయ్య పేట నియోజకవర్గంలో, దేవినేని వెంకటరమణ బ్రాంచ్ కెనాల్ కింద రైతాంగానికి తాగు, సాగునీరిచ్చేలా రూపొందించి, ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేయడం జరిగిందని టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ...!
 
ముక్యాల ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభమయ్యే సమయానికి వైసీపీ అధికారంలోకి వచ్చింది.  ఆప్రాజెక్టుని వెంటనే యాదాద్రికి మార్చేసి, వైఎస్సార్ ఎత్తిపోతలపథకంగా పేరు మార్చడం జరిగింది.

యాదాద్రిలో అదివరకే ఒకఎత్తిపోతల పథకం ఉంది. ముక్యాల ప్రాంతం నుంచి యాదాద్రికి  ప్రాజెక్టుని మార్చింది కేవలం పేరు పెట్టుకోవడానికే. ఆరోజు కూడా , ఇప్పుడు కొట్టుకున్నట్లే డబ్బాలు కొట్టుకున్నారు. వైఎస్సార్ ముక్త్యాలపథకమని, తనఆలోచనల్లోంచి పుట్టిందని సిగ్గులేకుండా చెప్పుకున్నారు. ఇది ఎంతటి దౌర్భాగ్యమో చెప్పాల్సిన పనిలేదు.

టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో మొదలైన 62ప్రాజెక్టుల్లో, 19ప్రాజెక్టులను ప్రారంభం చేశారు. పులిచింతల, గుండ్లకమ్మ, మడకశిర  బ్రాంచ్ కెనాల్, అడవిపల్లి రిజర్వాయర్ల పనులు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. మొత్తం 62 ప్రాజెక్టుల్లో జీడిపల్లి – ఎగువపెన్నార్ ప్రాజెక్ట్ అనేది పరిటాల రవీంద్ర కల. పేరూరు ప్రాజెక్ట్ కి నీళ్లురాని పరిస్థితుల్లో, పరిటాల రవీంద్ర ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నసమయంలో సమస్యను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.

చంద్రబాబు పాదయాత్ర చేసిన సమయంలో రవీంద్ర సతీమణి శ్రీమతి సునీత పేరూరు డ్యామ్ దగ్గరున్న పాఠశాలలోనే బసఏర్పాటు చేశారు. ఆనాడు చంద్రబాబు నాయుడు ఆ డ్యామ్ మొత్తం పరిశీలించి, పేరూరు డ్యామ్ కు నీళ్లొచ్చేలా చేస్తామని చెప్పారు. అన్నమాట ప్రకారమే హంద్రీనీవా కాలువద్వారా నీళ్లు పారించారు. పరిటాల సునీత మంత్రిగా ఉన్న సమయంలోనే ఆప్రాజెక్ట్ కి పరిటాల రవీంద్ర పేరు పెట్టడం జరిగింది.

ఇప్పుడు అదే ప్రాజెక్ట్ పేరుని వైఎస్సార్ పేరుతో మార్చేశారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య, తప్పుడు కార్యక్రమం.  ఆప్రాంతంలోని నాయకులు చేసిన మంచి కార్యక్రమాల ను దృష్టిలో పెట్టుకొనే, ఆనాడు రవీంద్ర పేరు పెట్టడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యేలు అడిగారంటూ,  జగన్ ప్రభుత్వం జీవోలు చూపిస్తూ, ప్రాజెక్ట్ పేరు మార్చడమనేది నీతిబాహ్యమైన చర్య. 

అవసరమైతే పన్నెండు రిజర్వాయర్లు తవ్వినా జగన్ ప్రభుత్వాన్ని ఎవరూ కాదనరు. కానీ ఒకే ఏజెన్సీకి ఒకే పనికింద మూడు రిజర్వాయర్లు తవ్వమని ఆదేశించడమేంటి? నిన్నటివరకు రివర్స్ టెండరింగ్ డ్రామాలు చూశాము, ఇప్పుడు రీఇంజనీరింగ్ చూస్తున్నాము. ఒక ఏజెన్సీ ఒకపని చేస్తున్నప్పుడు, అదే ఏజెన్సీపరిధిలోని పనులను రద్దుచేసి, గతంలో నిర్దేశించిన మొత్తానికే కొత్తగా పనులు ప్రతిపాదిస్తారు.

ఆ విధంగా ప్రతిపాదించిన పనులు గతంలో ఒప్పుకున్న అమౌంట్ కే అయిపోతాయని చెబుతున్నారు. ఈ డ్రామా చాలా గొప్పగా ఉంది. ప్రభుత్వం ఆడుతున్న జగన్నాటకాలు చాలా బ్రహ్మండంగా ఉన్నా యి. పేరూరు డ్యామ్ కి  నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమం ముసుగులో కర్ణాటక నుంచి నీళ్లు తీసుకురావచ్చా అంటూ గతంలో వైసీపీవారే బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు.

రూ.250కోట్ల దోపిడీకి తెరలేపారని గగ్గోలు పెట్టారు. ఇప్పుడు ఈప్రభుత్వం ముక్కు నేలకు రాస్తుందా అని ప్రశ్నిస్తున్నా. మేం తీసుకొచ్చిన పేరూరు ప్రాజెక్ట్ గురించి అడ్డగోలుగా అబద్ధాలు చెప్పారు. బాధ్యతారాహిత్యంగా నోటికొచ్చిందల్లా చెప్పారు. మాప్రభుత్వం సాగునీటి రంగానికి ఖర్చు చేసింది రూ.64వేలకోట్లయితే, పాదయాత్రలో, మీరు అచ్చువేసిన పుస్తకాల్లో రూ.56,700కోట్ల అవినీతి, దోపిడీ జరిగాయన్నారు.

ఆనాడు దుర్మార్గంగా బురదజల్లి, టన్నుల టన్నుల పుస్తకాలు పంచిపెట్టారు.  చంద్రబాబు తీసుకొచ్చిన పేరూరు ప్రాజెక్ట్ కరెక్టే, కేటాయించిన సొమ్ము కరెక్టే కానీ, ఇప్పడు జగన్మోహన్ రెడ్డి రీ ఇంజనీరింగ్ చేయడం వల్లే సమస్యంతా. ముక్త్యాల, పేరూరు, పట్టిసీమ, పోలవరం అన్నీ కరెక్టేనని, అన్ని పనులు రూల్స్ ప్రకారం, కచ్చితంగానే జరిగాయని మీరే కేంద్రానికి నివేదిక ఇచ్చా రు. పార్లమెంట్ కు, రాజ్యసభకు, కేంద్రజలవనరుల శాఖకు కూడా అదే చెప్పారు. ఇప్పడేమో తండ్రిపేరుపెట్టుకోవాలన్న దురాశతో ప్రాజెక్టులు నిర్మించాల్సిన స్థలాలు కూడా మారుస్తున్నారు. 

పుట్టకనుమ ప్రాజెక్ట్ కి నేదురుమల్లి జనార్థన్ రెడ్డి టైమ్ లో శంఖుస్థాపన చేశారు.  పేదలు, బడుగు-బలహీనవర్గాల వారికి అండగా నిలిచిన పరిటాల రవీంద్ర పేరు తీసేయడమేంటి? టీడీపీ అధికారంలోకి రాగానే, జీడిపల్లి పేరూరు ఎత్తిపోతల పథకానికి మళ్లీ పరిటాల రవీంద్ర పేరే పెట్టి తీరుతాం. 
 
గత 18 నెలల్లోసాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి రూ.1000 కోట్లయినా ఖర్చుపెట్టారా? ఉత్తరాంధ్ర సుజలస్రవంతి,  బహుదా – వంశధార, వంశధార – నాగావళి కట్టలపనులు ఎందుకు రద్దుచేశా రు?  వంశధార – నాగావళి అనుసంధాన పనులు నేటికీ ఎందుకు ప్రారంభించలేకపోయారు? తోటపల్లి రిజర్వాయర్ పనులు ఏమయ్యాయి?  పెద్దపెద్ద పదవుల్లో ఉండి బూతులు మాట్లాడే మంత్రులంతా, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎన్నికోట్ల రూపాయల పనులు జరిగాయో చెప్పగలరా? 

ఏ నాయకుడైనా సరే ధైర్యంగా ముందుకొచ్చి చేసిన పనులుగురించి చెప్పగలడా అని ఛాలెంజ్ చేస్తున్నా.  పోలవరం ప్రాజెక్టులో ఎన్ని వందలకోట్ల పనులు చేశారు...ఎన్ని లక్షలక్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారు.. ఎన్ని లక్షలక్యూబిక్ మీటర్ల మట్టిపనులు జరిగాయో చెప్పగలరా? పరిటాల రవీంద్ర ప్రాజెక్ట్ కి సంబంధించి టీడీపీ హాయాంలోనే 45కిలోమీటర్ల వరకు పనులు చేయడం జరిగింది.

రూ.45కోట్లవరకు బిల్లులు చెల్లింపులుకూడా అయ్యాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్కడ ఎన్నికోట్ల పనులు చేసిం ది? ఆనాడు పనులే రద్దుచేయాలన్న వారు, ఇప్పుడు పేర్లు ఎలా మారుస్తారు? పేర్లు పెట్టుకోవడానికి ఒక రిజర్వాయర్ పనులు రద్దుచేసి, మూడు రిజర్వాయర్లంటూ అదే కాంట్రాక్ట్ సంస్థకు, అదే రూ.804కోట్ల అమౌంట్ కు పనులు కట్టబెడుతున్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డిలా ఇంతతెలివిగా రీ ఇంజనీరింగ్ చేసిన దాఖలాలు లేవు. ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ కే కొత్త అర్థాలు చెబుతూ టెండర్లతో,అంచనాలతో పనిలేకుండానే, అదే ఏజన్సీ, అదే అమౌంట్ తో కొత్తకొత్త రిజర్వాయర్లు కడుతుందని చెబుతున్నారు. 

అధికారులు కూడా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకుంటే మంచిది. జైలుకెళ్లి వచ్చిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను గుర్తుపెట్టుకో వాలి. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి ఇంతవరకు పోస్టింగ్ రాలేదు. ప్రధానప్రతిపక్షంపై బురదజల్లాలన్న కుయుక్తితో ప్రభుత్వం తీసుకునే అడ్డగోలు, అవినీతి నిర్ణయాల్లో భాగస్వాములు కావొద్దని చెబుతున్నాం.

ప్రభుత్వాలు శాశ్వతంకాదని గుర్తుంచుకోవాలి. రాష్ట్రంలో ఇరిగేషన్ రంగాన్ని నాశనం చేసిన ప్రభుత్వం, 18నెలల్లో రూ.1000కోట్ల పనులుకూడా చేయలేదు. ఎక్కడా ఒక్కప్రాజెక్ట్ కూడా పూర్తిచేసింది లేదు. చేయాల్సిన నాశనమంతాచేసేసి, మేం ఆదాచేశాం.. రీ ఇంజనీరింగ్ చేశామంటూ తప్పుడు భాష్యాలు చెబుతున్నారు.

రాయలసీమలోని సోమశిల, స్వర్ణముఖి, కుప్పం కాలువపనులు ఏమయ్యాయి? రూ.3,500కోట్లవరకు ఖర్చు పెట్టి, తమప్రభుత్వం పులివెందులవరకు నీళ్లు తీసుకెళ్లింది.  అవుకు టన్నెల్ పూర్తిచేసి, గండికోటలో 12 టీఎంసీలు నిల్వచేశాం. ఇప్పుడు మీరు గండికోట నిర్వాసితులకు ఏమీచేయలేదు. వారికి ఎక్కడా ఒక్కఇల్లు కూడా కట్టించలేదు. పోలవరం నిర్వాసితులకు రూ.10లక్షలు, 20లక్షలిస్తామని ఉత్తరకుమారప్రగల్భాలు పలికారు.

జగన్మోహన్ రెడ్డి నోటినుంచి పోలవరం నిర్వాసితులు ప్రస్తావన ఎందుకు రావడంలేదు? పోలవరం నిర్మాణానికి తమప్రభుత్వం ఖర్చుచేసిన నిధులను కేంద్రంనుంచి తెచ్చుకోలేక ఆపసోపాలు పడుతున్నారు. గతంలో రూ.1850కోట్లు తీసుకొచ్చి లిక్కర్ కంపెనీలకు చెల్లించారు. ఇప్పుడు రూ.2,250కోట్లు నిర్వాసితులకు కట్టమని కేంద్రం, రాష్ట్రాన్ని హెచ్చరించే పరిస్థితులొచ్చాయి. ప్రభుత్వ పనితీరు, నిర్వాకాలు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది.

వేదవతి, కుప్పం, రాజోలిబండ కుడికాలువ మళ్లింపు పథకం, గుండ్రేవుల, విసన్నపేట చెనుగొండ , చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, చోడవరం, వైకుంఠపురం బ్యారేజీల నిర్మాణాలను ఎందుకురద్దుచేశారో చెప్పాలి. వైకుంఠపురం బ్యారేజీ పూర్తైఉంటే, 10 టీఎంసీల నీళ్లు నిలబడేవి. గోదావరి నీరు నాగార్జునసాగర్ కుడికాలువకు, అక్కడినుంచి బొల్లాపల్లికి వెళ్లి ఉండేవి.

18నెలలనుంచీ టీడీపీపై బురదజల్లడం తప్ప, ఏం చేశారు. పరిటాల రవీంద్రను భౌతికంగా లేకుండా చేసిందికాక, నేడు ఆయన పేరు మార్చి, మంచిరోజులు వస్తున్నాయని సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారు. పరిటాలరవీంద్ర పేరు తీసేయడానికి, ఈప్రభుత్వానికి 18నెలల సమయంపట్టింది. ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ లో ఎందరో మేథావులను, మహానుభావులను, నిష్ణాతు లను చూశాం. 

వారి పుట్టినరోజులను రాష్ట్ర పండుగలుగా తమ ప్రభుత్వం నిర్వహించింది. ఈప్రభుత్వం రీఇంజనీరింగ్ కి కొత్త అర్థాలు చెబుతూ, ఆ మహానుభావుల పేర్లను చెడగొడుతున్నారు. వైఎస్సార్ పేరు పెట్టడానికి, విగ్రహాలు పెట్టడానికి ప్రజలు అధికారం ఇవ్వలేదని గుర్తుంచుకుంటే మంచిది. నేడు మీరు తీసుకునే  నిర్ణయాలు, చేసేతప్పుడు కార్యక్రమాలు కచ్చితంగా తిరగరాయ బడతాయని గుర్తుంచుకోండి. ముక్త్యాల ఎత్తిపోతల పథకాన్ని యాదాద్రికి ఎందుకు మార్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నా.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు