కాపులను రంపానపెట్టింది.. చంద్రబాబే.. పవన్ న్యూట్రల్‌గా వున్నారు: రోజా

ఆదివారం, 27 ఆగస్టు 2017 (19:02 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్‌లను కాకినాడ నగర పాలక ఎన్నికల నేపథ్యంలో వైకాపా ఎమ్మెల్యే రోజా ఏకిపారేశారు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ముందుంటారని రోజా విమర్శించారు.
 
 రాష్ట్రంలో అత్యధిక కాలం పదమూడేళ్లు అధికారంలో ఉండి ఈ కాపులను రాచి రంపానపెట్టింది, నాశనం చేసింది ఎవరంటే చంద్రబాబునాయుడే. కాపులను అభివృద్ధి చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డిగారేనని రోజా గుర్తు చేశారు. అందుకే, వైఎస్ బతికున్నంత కాలం ఆయనకు కాపులు తోడుగా ఉన్నారని రోజా చెప్పుకొచ్చారు
 
కాకినాడలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ కచ్చితంగా గెలుస్తుందని జోస్యం చెప్పారు. టీడీపీకి కాపులు ఓటు వెయ్యరు. పవన్ కల్యాణ్ గారు న్యూట్రల్‌‌గా ఉన్నారు. కాపులందరికీ తానే న్యాయం చేసినట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారని రోజా ఫైర్ అయ్యారు. 
 
ప్రతి ఏటా కార్పొరేషన్ బడ్జెట్‌లో కాపులకు వెయ్యికోట్లు కేటాయించామని చంద్రబాబు చెబుతున్నారు. అవన్నీ అసత్యాలేనని.. నాలుగు బడ్జెట్‌లలో నాలుగు వేల కోట్లు ఇచ్చి వున్నట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు