జనసేన బలపడుతుంటే చూసి ఓర్వలేక దాడులు చేస్తున్నారు: నాదెండ్ల మనోహర్

శనివారం, 20 ఫిబ్రవరి 2021 (19:49 IST)
జనసేన పార్టీ బలపడుతుంటే చూసి ఓర్వలేకే కక్షపూరితంగా అధికార పార్టీ ఇలాంటి దాడులకు పాల్పడుతుందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. అధికార యంత్రాంగం బాధ్యతతో వ్యవహరించాలని కోరారు.

శనివారం సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రిలో దమ్మాలపాడులో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల దాడిలో గాయపడిన జన సైనికులను పరామర్శించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన సతీష్, కోడె భుజంగనాయుడులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం నింపారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ..

"ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికల ప్రక్రియలో పోటీ చేసేందుకు ముందుకు వచ్చిన వారిని అభినందించాల్సింది పోయి ఇలాంటి దాడులకు పాల్పడడం దారుణం. అధికార పార్టీ వారు చేసిన దాడిలో సతీష్, భుజంగనాయుడుతోపాటు పలువురు గాయపడ్డారు. డబ్బు పంచుతుంటే ప్రశ్నించిన మా పార్టీ కార్యకర్తలపై రాళ్ల దాడి జరిగింది.

ఒక వ్యక్తికి 15 కుట్లు పడ్డాయి. మరొకరు నరసరావుపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అహంకారంతో కక్షపూరిత ధోరణిలో గ్రామాల్లో కూడా గ్రూపు తగాదాలు సృష్టించే ప్రయత్నం చేశారు. దాడి విషయం తెలియగానే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు వెంటనే ఇక్కడికి వెళ్లమని పంపారు. వారికి భరోసా కల్పించి, వారి కుటుంబాల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశాం.

ఇటువంటి పరిస్థితికి కారణం ఎవరు? స్థానికంగా ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో పర్యటించినప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కానీ వారి పవర్ చూపించుకునే ప్రయత్నాల్లో భాగంగా దౌర్జన్యంగా వ్యవహరించారు. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇంతకన్నా మీకు ఏం కావాలి. ప్రజల మీద దాడులు చేయాల్సిన అవసరం ఏముంది.? 

స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యత ఇచ్చి ప్రజాస్వామ్య ప్రక్రియలో వారు పాల్గొనే ఏర్పాటు చేయాలి. గ్రామాల్లో ఇలాంటి కక్షపూరిత వాతావరణాన్ని సృష్టించడాన్ని జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం..
 ప్రజాస్వామ్యంలో సామరస్యంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియ ఇది.

గ్రామస్తులంతా కూర్చుని పెద్ద మనుషుల సమక్షంలో కూర్చుని అభ్యర్ధులను నిలబెట్టుకుంటే.. వారిని కావాలని రెచ్చగొట్టి ఈ విధంగా చేశారు. ఈ ముఖ్యమంత్రి గారిని, శాసనసభ్యుల్ని హెచ్చరిస్తున్నాను. మీకు కూడా ప్రజలు బుద్ది చెప్పే రోజు వస్తుంది.

ఓట్ల కోసం దౌర్జన్యాలకు పాల్పడాల్సిన అవసరం ఏంటి?  మంచి పనులు చేస్తే మిమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తారు. అదే నమ్మకంతో వెళ్లండి. నామినేషన్లే వేయనివ్వం.. ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటే సంక్షేమ పథకాలు తీసేస్తామని బెదిరించడం ఏంటి? ఇలాంటి చర్యలు ఆశ్చర్యం కలిగి స్తున్నాయి" అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు