ఇంజనీరింగ్ విద్యార్థినిపై సీనియర్ల లైంగిక దాడి.. గ్యాంగ్ రేప్ జరిగి వుండొచ్చునని?

సోమవారం, 22 మే 2017 (12:58 IST)
హైదరాబాదులో ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిపై నలుగురు సీనియర్లు లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాధితురాలు అపస్మారక స్థితికి చేరినా.. ఆమె రోడ్డు ప్రమాదంలో గాయపడిందని సీనియర్లు నమ్మించే ప్రయత్నం చేశారు. ఇందుకు పోలీసులు కూడా కేసు వివరాలను బయటికి పొక్కనివ్వట్లేదని సమాచారం.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగర శివారులోని బోడుప్పల్‌లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని పరీక్షలు రాసేందుకు కళాశాలకు వెళ్తోంది. శనివారం మధ్యాహ్నం పరీక్ష రాసిన తర్వాత ఇంటికి వెళ్ళేందుకు సిద్దమైంది. అయితే అప్పటికే ఆమె కాలేజీ బస్సు వెళ్ళిపోయింది. అంతలో తన సీనియర్ విద్యార్థి ఒకరు అక్కడ కన్పించాడు.
 
దాంతో అతని బైక్‌పై ఇంటికి బయల్దేరింది. కానీ మార్గమధ్యలో సీనియర్ విద్యార్థి ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అతను ఇచ్చిన సమాచారం మేరకు మరో ముగ్గురు సీనియర్లు అక్కడికి చేరుకొన్నారు. నలుగురు కలిసి ఆమెపై లైంగికదాడికి పాల్పడినట్టు సమాచారం.
 
అపస్మారకస్థితికి చేరుకొన్న విద్యార్థినిని బోడుప్పల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. కానీ ఆస్పత్రిలో చేర్చే క్రమంలో సీనియర్లు రోడ్డు ప్రమాదంలో ఆమె గాయపడినట్లు తెలిపారు. కాలు విరిగి, తలకు బలమైన గాయాలతో విద్యార్థిని అపస్మారక స్థితిలో ఆసుపత్రికి చేరినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసు విచారణలో నలుగురు సీనియర్ విద్యార్థులు పొంతన లేని సమాచారం ఇచ్చారు. దీంతో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగి వుండొచ్చునని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి