ఏపీలో ‘వృక్ష సేవక్’కు రూ. 1,35,472... ఇలా చేయాలి...

గురువారం, 16 నవంబరు 2017 (21:11 IST)
కొంతకాలంగా రాష్ట్రంలో రహదారుల విస్తరణ పెద్దఎత్తున పలు దశల్లో జరుగుతూ వుంది. జాతీయ రహదారులు నుండి పంచాయతి రోడ్ల వరకు అన్నీ కొత్తరూపు తీసుకుంటున్నాయి. రహదారుల అభివృద్ధితో పాటు వాటి మీద తిరిగే వాహనాలు పెరగడం అవి వెదజల్లే కాలుష్యం పెరగడం గ్రామాలకు కూడా విస్తరించింది. ఇటువంటి ప్రతికూల అంశాల మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి, ఇందుకు చేపట్టవలసిన అనువైన పరిష్కార మార్గాన్ని, పేదరిక నిర్మూలనకు జోడించింది. అదే- ‘ఎవెన్యు ప్లాంటేషన్’ పథకం. రోడ్లకు రెండు వైపులా నాటుతున్న ఈ మొక్కలు వృక్షాలుగా మారితే భారీ వర్షాలు వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయలో రోడ్లు ధ్వంసం కావడాన్ని కూడా నిరోధించవచ్చు. ఈ ఏడాది జూలైలో మొదలైన ఈ పథకం నవంబర్ 15 నాటికి 11,604 మంది డ్వాక్రా మహిళలకు ప్రయోజనం కలిగేవిధంగా 10,000 కి.మీ. పొడవున 39,41,473 మొక్కలు నాటడం పూర్తి అయింది.
  
భారత ప్రభుత్వం దేశం అంతటా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ఏపీలో ‘సెర్ప్’ అమలు చేస్తున్నది. దీన్ని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ – గ్రామీణ ఉపాధి హామీ పధకంతో అనుసంధానం చేసారు. అందువల్ల స్వయం సహాయ బృందాల్లో నిరుపేద, చిన్న సంఘం సభ్యుల ద్వారా ఇది అమలు జరుగుతున్నది. వీరిని ‘వృక్ష సేవక్’గా వ్యవరిస్తున్నారు. ఎన్నుకోబడిన ఇద్దరు నిరుపేద చిన్న సంఘం సభ్యురాళ్ళకు ఒక్కొక్కరికి 200 మొక్కల చొప్పున కేటాయిస్తున్నారు. వీరు తమకు కేటాయించిన మొక్కలకు నీరు, పశువుల నుంచి రక్షణ, సహజ ఎరువులు అందిస్తూ వాటిని సంరక్షించాలి. ఈ పధకం కాల వ్యవధి 3 సంవత్సరాలు.
 
ఈ పధకంలో లబ్దిదారునికి భూమిపై ఎటువంటి హక్కులు వుండవు. భూమిపై సర్వ హక్కులు ప్రభుత్వానికే చెందుతాయి. లబ్దిదారుడు కేవలం అనుమతించిన మొక్కల రకాలను మాత్రమే నాటి వాటికి నీరు పోసి సంరక్షణ పనులను చేయాలి. లబ్దిదారుడు మొక్కకు ఎలాంటి హనీ చేయకుండా మరియు ప్రజల ఆస్థికి నష్టం వాటిల్లకుండా ఫలసాయం మాత్రమే తీసుకోవాలి. ఏదైనా చెట్టు చనిపోయినట్లయితే మొదట 20% మొక్కలను ఈ పథకం ద్వారా కొత్త మొక్కను నాటుకోవచ్చును. తరువాత సంవత్సరం నుండి ఏదైనా చెట్టు తొలగించవలసినచో లేక చనిపోయినట్లయితే తిరిగి సొంత ఖర్చులతో కొత్త మొక్కను నాటుకోవాలి. లబ్దిదారుడు తనను కేటాయించిన భూమిలో మాత్రమే మొక్కలను నాటుకోవాలి. ఇతరుల భూమిని ఆక్రమణ చేయకూడదు.
 
ఈ పధకంలో లబ్దిదారులు చేయవలసిన పనులు ఇలా వుంటాయి-  వర్షం లేని సమయంలో ఒక ఏడాదిలో ఒక్కో మొక్కకు మొదటి సంవత్సరం: 10 లీటర్లు నీరు 40 సార్లు పోయాలి. రెండు, మూడవ సంవత్సరాలు : 10 లీటర్లు నీరు 25 సార్లు పోయాలి. ఇందుకుగాను... మొదటి సంవత్సరానికి సుమారుగా రూ. 54,064/-. రెండు, మూడవ సంవత్సరానికి సుమారుగా రూ. 40,704/- ఇలా మొత్తంగా మూడు సంవత్సరాలకు గాను సుమారుగా ఒక ‘వృక్ష సేవక్’ కు రూ. 1,35,472/- ఆర్ధిక ప్రయోజనం లభిస్తుంది. లబ్దిదారుని పెంపకంలో 50 శాతం, ఆపైన బ్రతికి ఉన్న మొక్కలకు మాత్రమే ఆర్ధిక ప్రయోజనం అందుతుంది. అంతేకాకుండా చెట్టు పట్టా అనుభవ అధికార హక్కు) పొందటం వలన నాటిన పండ్ల మొక్కల ఫలాల దిగుబడి మొదలైన తర్వాత ఆ ఫలసాయం మీద లబ్దిదారుకే అనుభవ హక్కులు వుంటాయి. దీని ద్వారా పేదలకు ఆర్ధిక అదనపు ఆదాయం లభిస్తుంది.
 
ఈ పధకంలో నాటే మొక్కలివి- పండ్లను ఇచ్చే మొక్కల రకాలు 1. విత్తనం ద్వారా మొలకెత్తిన మామిడి 2. చింత 3. అల్లనేరేడు 4. వెలగ 5. సీమ బాదం 6. సీమ చింత. నీడనిచ్చే మొక్కల రకాలు 1.వేప 2.కానుగ 3.రావి 4.మర్రి 5.తెల్లమద్ది 6.మద్ది.  ప్రభుత్వ జాతీయ రహదారుల వెంబడి, గ్రామ పంచాయితీలోని రహదారుల వెంబడి  భూములలో మొక్కలు నాటేందుకు, చెట్ల ఫలసాయంపై వారసత్వ హక్కుల కల్పనకు ఆదేశాల పత్రం చెట్టు పట్టా జారీ చేయబడుతుంది. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటడం మొత్తం 400 మొక్కలలో 20% మాత్రమే అంటే 80  మొక్కలు మాత్రమే చనిపోయిన స్థానంలో నాటుకోవడానికి రెండవ ఏడాది అవకాశం వుంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు