జగన్‌కు షాకిచ్చిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలు .. వైకాపాకు రాజీనామా

ఠాగూర్

శనివారం, 31 ఆగస్టు 2024 (09:14 IST)
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన మరో ఇద్దరు నేతలు తేరుకోలేని షాకిచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు తమ పదవులకు రాజీనామా చేశారు. రెండు రోజుల క్రితం జగన్‌కు అత్యంత సన్నిహితులుగా పేరొందిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, పార్టీ నేత బీద మస్తాన్ రావులను తమతమ రాజ్యసభ సభ్యత్వాలతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. వీరి రాజీనామాలు వైకాపాలు పెను కలకలం రేపాయి. దీంతో వైకాపా పెద్దలు దిద్దుబాటు చర్యలతో పాటు.. పార్టీ నుంచి నేతలు చేజారిపోకుండా ఉండేలా అడ్డుకట్ట వేసేందుకు రంగంలోకి దిగారు. కానీ, ఇంతలోనే మరో ఇద్దరు నేతలు పార్టీకి రాజీనామాలు చేశారు. వీరిలో కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణచక్రవర్తిలు ఉన్నారు. 
 
కాకినాడ జిల్లాకు చెందిన కర్రి పద్మశ్రీ (గవర్నర్‌ కోటా), ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన బల్లి కల్యాణచక్రవర్తి (ఎమ్మెల్యే కోటా)లు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వీరిద్దరూ శుక్రవారం మండలికి, పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే పోతుల సునీత (ఎమ్మెల్యే కోటా) కూడా ఎమ్మెల్సీ పదవికి, వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మోపిదేవి, మస్తాన్‌రావుల రాజీనామాలను రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ గురువారమే ఆమోదించగా.. సునీత, పద్మశ్రీ, కల్యాణ చక్రవర్తిల రాజీనామాలను ఆమోదించకుండా మండలి చైర్మన్‌ మోషేన్‌రాజు పెండింగ్‌లో పెట్టడం గమనార్హం. ఆమోదిస్తే ఇవి టీడీపీ కూటమి ఖాతాలోకి వెళ్లిపోతాయి. కాగా.. కొందరు వైసీపీ ముఖ్య నేతల వ్యవహారశైలినీ జగన్‌ శంకిస్తున్నట్లు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు