రేపటి నుంచి గుంటూరు జిల్లాలో ఉదయం 11 వరకే దుకాణాలు

శుక్రవారం, 17 జులై 2020 (08:57 IST)
గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో శనివారం నుండి జిల్లా వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు మాత్రమే షాపులు తెరచి వుంచబడతాయని జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు.

ప్రజలు నిత్యావసర సరుకులు కొనుగోలుకు ఉదయం 6 గంటల నుండి ఉదయం 11  గంటల వరకు మాత్రమే శనివారం నుండి అనుమతించడం జరుగుతుందన్నారు. ఈ నిబంధనలు ఒక వారం రోజులపాటు అమలులో ఉంటాయన్నారు. రోడ్ల ప్రక్కన, బండ్లపై జరిపే చిరు వ్యాపారాలకు, అంగళ్ళకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయన్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ప్రజలు ఎవ్వరూ అనవసరంగా బయటకు రాకూడదన్నారు. అత్యవసరంగా బహిరంగ ప్రదేశాలకు వచ్చే వారు తప్పని సరిగా మాస్కులు ధరించాలన్నారు. బయటకు వచ్చినప్పుడు భౌతిక దూరం పాటించాలన్నారు. ద్విచక్ర వాహనంపై ఒక్కరు మాత్రమే ప్రయాణించాలన్నారు.

కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేసేందుకు ప్రతి ఒక్కరూ తరచూ చేతులు శానిటైజ్ చేసుకుంటూ, అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని  కలెక్టర్ పేర్కొన్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు