పార్లమెంటులో అల్లూరి విగ్రహం

బుధవారం, 2 అక్టోబరు 2019 (15:57 IST)
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని పార్లమెంట్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు క్షత్రియ సంక్షేమ పరిషత్‌ కల్యాణ మండపంలో ఆదివారం ఏర్పాటు చేసిన జాతీయ క్షత్రియ ఫెడరేషన్‌ సర్యసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. క్షత్రియులు సేవా తత్పరులని, పదవులు ఉన్నా లేకున్నా సేవా మార్గమే పరమావధిగా భావిస్తారని చెప్పారు.

క్షత్రియులు పులులు వంటి వారని, అయితే అడవుల్లో వాటిలా పోటాడుకోవడం మాని అభివృద్ధిలో పోటీ పడాలని హితవు పలికారు. సంక్రాంతి సంబరాల్లో నిర్వహించే కోడి పందాలు సంప్రదాయబద్ధంగా జరగాలని, వచ్చే పండుగకు తాను కోనసీమ రావడానికి ప్రయత్నిస్తానని చెప్పారు.

ఆల్‌ ఇండియా క్షత్రియ ఫెడరేషన్‌ చైర్మన్‌ కులదీ్‌పసింగ్‌ సోలంకి మాట్లాడుతూ క్షత్రియ సంక్షేమానికి దాతలు పెద్ద ఎత్తున విరాళాలు అందించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర మంత్రి సీహెచ్‌ రంగనాథరాజు మాట్లాడుతూ క్షత్రియ సామాజిక వర్గం రాన్రానూ తగ్గిపోతోందని చెప్పారు. నరసాపురం, ఆచంటలో క్షత్రియ సామాజిక వర్గం మైనార్టీలో ఉన్నప్పటికీ ముదునూరి ప్రసాదరాజు, తాను విజయం సాధించామన్నారు.

నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, మంతెన రామరాజు, ఎమ్మెల్సీలు కంతేటి సత్యనారాయణరాజు, ఫెడరేషన్‌ చైర్మన్‌ సీహెచ్‌ వెంకటపతిరాజు (పెదబాబు), పాకలపాటి రఘువర్మ, మంతెన సత్యనారాయణరాజు, క్షత్రియ సంక్షేమ పరిషత్‌ అధ్యక్షుడు కె.వి.రామకృష్ణంరాజు మాట్లాడారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు