రేపటి నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు

ఆదివారం, 14 మే 2023 (13:41 IST)
ఈ నెల మే 15వతేదీ నుంచి వచ్చే నెల జూన్ 12వ తేదీ వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. తిరిగి జూన్ 13 నుంచి కోర్టు కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసర వ్యాజ్యాల విచారణకు వెకేషన్ కోర్టులు ఏర్పాటు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. హైబ్రిడ్ విధానంలో విచారణలు జరిపేందుకు వెసులు బాటు కల్పించింది. మొదటి దశ వెకేషన్ కోర్టుల్లో ఈ నెల 18, 25 తేదీల్లో విచారణలు జరగనున్నాయి. 
 
మే 18వ తేదీన న్యాయమూర్తులు జస్టిస్ బీఎస్ భానుమతి, జస్టిస్ ఏవీ రవీంద్రబాబు డివిజన్ బెంచ్, జస్టిస్ గన్నమనేని రామ కృష్ణ ప్రసాద్ సింగిల్ బెంచ్ విచారణలు చేయనున్నారు. డివిజన్ బెంచ్‌ల విచారణలు పూర్తయ్యాక న్యాయమూర్తులు సింగిల్ బెంచ్ నిర్వహిస్తారు. మే 25వ తేదీన జస్టిస్ బీ కృష్ణమోహన్, జస్టిస్ ఏవీ రవీంద్రబాబు డివిజన్ బెంచ్‌గా, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ సింగిల్ బెంచ్‌గా విచారణలు నిర్వహిస్తారు. 
 
రెండో దశ వెకేషన్ కోర్టులు జూన్ 1, 8వ తేదీల్లో విచారణలు జరుపుతాయి. జస్టిస్ బి కృష్ణ మోహన్, జస్టిస్ వీ గోపాలకృష్ణరావు డివిజన్ బెంచ్ నిర్వహిస్తారు. జస్టిస్ దుప్పల వెంకటరమణ సింగిల్ బెంచ్ నిర్వహిస్తారు. జూన్ 8న జస్టిస్ ఎన్ జయసూర్య, జస్టిస్ వీ గోపాలకృష్ణరావు డివిజన్ బెంచ్, జస్టిస్ దుప్పల వెంకటరమణ సింగిల్ బెంచ్ నిర్వహిస్తారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నోటిఫికేషన్ జారీ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు