తెలుగు దేశం పార్టీ వచ్చే వారం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది జగమెరిగిన సత్యం. టీడీపీ, బీజేపీ మళ్లీ చేతులు కలిపాయి.
పొత్తులో భాగంగా బీజేపీ-జనసేన కూటమికి టీడీపీ 30 అసెంబ్లీ, 10 లోక్సభ స్థానాలను వదులుకునే అవకాశం ఉంది. వచ్చే వారం టీడీపీ ఎన్డీయేలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19 లేదా 20 తేదీల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం.
20వ తేదీన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లతో బీజేపీ అగ్రనేతలు చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇప్పటికే మూడు పార్టీల మధ్య ఓ అవగాహన కుదిరిందని, సీట్ల పంపకం విషయంలో కూడా ఓ అవగాహన కుదిరిందని తెలుస్తోంది. మరోవైపు ఎన్డీయేలో చేరుతున్న ఇతర పార్టీల నేతలందరినీ పిలిచి సభ నిర్వహించాలని బీజేపీ ఆలోచిస్తోంది.