మీ అయ్య హయాంలో 26 కమిటీలు.. ఏం చేశారు.. ఇదీ అంతే.. చంద్రబాబు

శనివారం, 22 ఫిబ్రవరి 2020 (20:08 IST)
ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తన మీద, తెలుగుదేశం పార్టీ మీద ఎంత కక్ష ఉందో చెప్పడానికి మా ఐదేళ్ళ పాలన మీద శుక్రవారం వేసిన ప్రత్యేక దర్యాప్తు బృదం (సిట్) మరో ఉదాహరణ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఇలాంటి కమిటీలు వేయడం, చూడటం ఇదేమీ కొత్తకాదు. 9 నెలల్లో 3 సిట్‌లు, ఐదారు కమిటీలు వేసి తెలుగుదేశం పార్టీని కాదు, ఏకంగా ఏపీనే టార్గెట్ చేశారు. 
 
భావితరాలకు తీరని నష్టం చేశారు. అధికారంలోకి వస్తూనే తవ్వండి, తవ్వండి అన్నారు. తవ్వితే సన్మానాలు చేస్తాం, అవార్డులు ఇస్తాం... ప్లీజ్ అంటూ అధికారులను బతిమిలాడుకున్నారు. 8 నెలల క్రితమే మంత్రివర్గ ఉపసంఘం వేశారు. 
రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడటం, పెట్టుబడులను తరిమేయడం తప్ప ఏం సాధించారు? ఇప్పుడీ జీవో 344 వైసిపి వేధింపులకు పరాకాష్ట.

గత ఐదేళ్ళ నిర్ణయాలపై మీరు సిట్ వేశారు. మీ ఐదేళ్ళ పాలనపై రేపు రాబోయే ప్రభుత్వం సిట్ వేస్తుంది. కక్ష సాధించుకోవడం తప్ప, వీటివల్ల ప్రజలకు ఒరిగేది ఏంటి? వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తనమీద 26 విచారణలు (14 సభా సంఘాలు, 3 ఉపసంఘాలు, 4 న్యాయ విచారణలు, అధికారులతో 4 విచారణలు, 1 సిబిసిఐడి ఎంక్వైరీ..) చేయించారు. ఏమైంది? ఇదీ అంతే! రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసి, పాలనా యంత్రాంగాన్ని డీమొరలైజ్ చేయడమే వైసీపీ లక్ష్యం. సిట్‌నే పోలీస్ స్టేషన్‌గా పరిగణిస్తాం అనడం... తాము చెప్పింది చేయని అధికారులను బెదిరించడం, వేధించడం కోసమే. టిడిపి నేతలపై కక్ష సాధించడమే వైసీపీ అజెండా తెలుగుదేశం పార్టీ ఏనాడూ ఎటువంటి తప్పులు చేయలేదు
వైసీపీ బెదిరింపులకు భయపడేది లేదు అంటూ వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు