మహనీయుడు ఎన్టీఆర్‌కే ఓటమి తప్పలేదు.. ఇక నేనెంత : చంద్రబాబు

మంగళవారం, 28 మే 2019 (13:50 IST)
ఇటీవల వెల్లడైన సార్వత్రిక ఎన్నికల ఫలితలను చూసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పూర్తి నైరాశ్యంలో కూరుకున్నట్టుగా తెలుస్తోంది. మంగళవారం గుంటూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
సినీ రంగాన్ని వదులుకుని ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చి పార్టీని స్థాపించి అతి తక్కువకాలంలోనే అధికారంలోకి వచ్చిన మహానేత స్వర్గీయ ఎన్టీ. రామారావు. అంతటి మహానీయుడుకే ఎన్నికల్లో ఓటమి తప్పలేదన్నారు. ఎన్నో అవమానాలు పడ్డారనీ, కష్టాలు ఎదుర్కొన్నారన్నారు. 
 
కానీ, ఆయన ఏనాడూ అధైర్యపడలేదని గుర్తుచేశారు. ఇపుడు మన పరిస్థితి కూడా అంతే. ఈ ఓటమి తాత్కాలికమే. ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకు సాగుదామని ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ విషయంలో మరోమాటకు తావులేదన్నారు. 
 
ఇకపోతే, తనకు తన కుటుంబ సభ్యులు ఎంత ముఖ్యమో... పార్టీ కార్యకర్తలు కూడా అంతే ముఖ్యమన్నారు. పైగా, తనకు కుటుంబం కంటే పార్టీ ముఖ్యమన్నారు. ఎన్నికల ఫలితాలపై కింది స్థాయి నుంచి సమీక్షలు చేసుకుందామన్నారు. కార్యకర్తలు చెప్పే వాటిని విని ముందుకుసాగుదామన్నారు. అదేసమయంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి, బాధ్యతగల ప్రతిపక్షంగా పని చేద్దామని చెప్పారు. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని పార్టీకి పూర్వవైభవం కోసం కృషి చేద్దామని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు