టీడీపీ - జనసేన - భాజపాల మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం.. వివరాలు ఇవే...

PNR

సోమవారం, 11 మార్చి 2024 (22:39 IST)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల కోసం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల మధ్య సీట్ల సర్దుపాటు పూర్తయింది. ఏపీలోని అధికార వైకాపాను గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా ఈ మూడు పార్టీలు కలిసి అడుగులు వేస్తున్నాయి. ఇందులోభాగంగా, ఈ మూడు పార్టీలు కలిసి సీట్ల సర్దుబాటు అంశంపై విజయవాడలోని ఉండవల్లిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో సుమారు ఎనిమిది గంటల పాటు సుధీర్ఘంగా చర్చలు జరిగాయి. 
 
ఇందులో టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్, బీజేపీ సీనియర్ నేతలు గజేంద్ర షెకావత్, బైజయంత్ పండాలు పాల్గొన్నారు. ఇందులో మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, ఎవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న అంశంపై క్షుణ్ణంగా చర్చించారు. సుధీర్ఘ సమావేశం అనంతరం సీట్ల పంపకం వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. 
 
పొత్తులో భాగంగా, జనసేన, బీజేపీకి కలిపి 31 అసెంబ్లీ స్థానాలు, ఎనిమిది లోక్‌‍సభ సీట్లను కేటాయించారు. ఇందులో జనసేన పార్టీ 21 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుండగా, బీజేపీ పది అసెంబ్లీ స్థానాలు ఆరు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక టీడీపీ 144 అసెంబ్లీ, 17 ఎంపీ సీట్లలో బరిలోకి దిగనుంది. 
 
కాగా, ఇటీవల జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, మూడు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుందని, ప్రకటించినప్పటికీ బీజేపీ కూడా పొత్తులోకి వచ్చిన నేపథ్యంలో గతంలో చేసిన ప్రకటనలో నేడు సవరణలు చేశారు. సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చన నేపథ్యంలో మూడు పార్టీలు అభ్యర్థుల జాబితాపై దృష్టిసారించనున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు