శ్రీరాముడు బీజేపీలోకి చేరేందుకు నిరాకరిస్తే ఈడీ - సీబీఐని ఉసిగొల్పేది.. కేజ్రీవాల్ సెటైర్లు

ఠాగూర్

ఆదివారం, 10 మార్చి 2024 (12:17 IST)
శ్రీరాముడు ఈ కాలంలో జీవించివుంటే తమ పార్టీలో చేరాలని భారతీయ జనతా పార్టీ నేతలు ఒత్తిడి చేసేవారని, అందుకు ఆయన నిరాకరించివుంటే ఈడీ, సీబీఐని ఉసిగొల్పేందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. దేశంలో తానేదో పెద్ద ఉగ్రవాదిని అయినట్టుగా ఈడీ అధికారులు పదేపదే సమన్లు పంపిస్తున్నారంటూ మండిపడ్డారు. తనను జైలుకు పంపి తమ ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తుందని ఆరోపించారు. 
 
ఇటీవల ఢిల్లీ అసెంబ్లీలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగిస్తూ, శ్రీరాముడు కనుక ఈ కాలంలో ఉండివుంటే బీజేపీ ఆయనను కూడా వదిలేది కాదన్నారు. తమ పార్టీలో చేరమని ఒత్తిడి చేసి ఉండేదన్నారు. ఒకవేళ రాముడు కనుక బీజేపీలో చేరేదిలేదని చెబితే ఈడీ, సీబీఐలను ఆయనపైకి ఉసిగొల్పి ఉండేదని వ్యాఖ్యానించారు. 
 
తమ ప్రభుత్వం వికాస్ మోడల్‌ను కొనసాగిస్తుంటే బీజేపీ మాత్రం వినాశ్‌‍ను ఎంచుకుని ప్రతిపక్ష పార్టీలను ఏలుతున్న ప్రభుత్వాలను పడగొడుతుందని ఆరోపించారు. తనకు 8 సమన్లు పంపడంపై ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు. తనను అరెస్టు చేసి జైలుకు పంపి తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే తాను అతిపెద్ద ఉగ్రవాదిని అయినట్టు వారు తనకు నోటీసులు పంపారని పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు