కరోనాకు మందు కనిపెట్టిన సీఎం జగన్‌కు నోబెల్ ఇవ్వాలి : ధూలిపాళ్ళ నరేంద్ర

మంగళవారం, 17 మార్చి 2020 (16:59 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం సరైన మందును కనిపెట్టలేకపోయింది. ఈ వైరస్ బారినపడుకుండా ఉండాలంటే వ్యక్తిగత శుభ్రతే ముఖ్యమని, ఇదే అంశంపై విస్తృతంగా ప్రచారం చేయాలని పదేపదే విజ్ఞప్తి చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ సోకినా ఒక పారాసిటమాల్ మాత్ర వేసుకుని బ్లీచింగ్ కొడితే కరోనా పారిపోతుందని సెలవిచ్చిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నోబెల్ పురస్కారం ఇవ్వాలని టీడీపీ సీనియర్ నేత ధూలిపాళ్ళ నరేంద్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
ఆయన మంగళవారం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, కరోనా వైరస్‌కు ప్రపంచ దేశాలే వణికిపోతున్నాయన్నారు. అనేక అంతర్జాతీయ ఈవెంట్లను సైతం వాయిదా వేస్తున్నారని గుర్తుచేశారు. మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో జరగాల్సిన ఎన్నికలు కూడా వాయిదావేశారని గుర్తుచేశారు. 
 
అలా కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచమే వణికిపోతుంటే.. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రం అవేమీ కనిపించడం లేదు.. వినిపించడం లేదన్నారు. ఎందుకంటే.. ఆయన దృష్టిలో కరోనా వైరస్ ఓ మహమ్మారి కాదన్నారు. పైగా, ఈ వైరస్ బారినపడితే ఒక పారాసిటమాల్ మాత్ర వేసుకుంటే సరిపోతుందని సెలవిచ్చారనీ, ఈ వైరస్ సోకకుండా ఉండాలంటే బ్లీచింగ్ పౌడర్ చల్లితే సరిపోతుందని వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇలాంటి జగన్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలని కోరారు. 
 
ఇకపోతే, కోరనా వైరస్ మహమ్మారి కారణంగా స్థానిక సంస్థలను వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు కులం ఆపాదించడం సీఎం జగన్ దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. ఆయన వ్యాఖ్యలు విని రాష్ట్ర పౌరుడిగా సిగ్గు పడుతున్నాను. రాగద్వేషాలకు, కులమతాలకు అతీతంగా రాజ్యాంగం పట్ల విధేయతతో ప్రజల కోసం పనిచేస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వ్యక్తి కులపరమైన వ్యాఖ్యలు చేయడం హేయాతిహేయమైన చర్యగా అభివర్ణించారు. 
 
మరోవైపు, రమేశ్‌ కుమార్‌ను ఎన్నికల కమిషనరుగా చూడవలసిన జగన్‌.. అతనిలోని కులాన్ని చూడడం బాధాకరమన్నారు. తన రాజకీయ వికృత క్రీడ కోసం, రాజకీయ అవసరాల కోసం జగన్‌ వాటేసుకుకున్న వల్లభనేని వంశీ, కరణం బలరామ్‌లది ఏ కులమో ఆయనే సమాధానం చెప్పాలన్నారు. తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన పీవీపీ వరప్రసాద్, నిమ్మగడ్డ ప్రసాద్‌, తనకు ఆర్థిక సహకారం అందించిన కోనేరు ప్రసాద్‌లది ఏ కులమో జగన్‌ చెప్పాలన్నారు. పదే పదే తనకు 151 సీట్లు వచ్చాయని చెప్పుకునే జగన్‌... రాష్ట్రంలో ఈ కులమే వుండాలి, మిగతా కులాలు వుండకూడదు... ఉన్నా మాట్లాడకూడదనే చట్టం చేస్తే భవిష్యత్తులో ఏ గొడవ వుండదని ధూలిపాళ్ళ నరేంద్ర అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు