పైనాపురంలో అక్ర‌మ మట్టి తవ్వకాలను ఆపండి...

గురువారం, 16 సెప్టెంబరు 2021 (10:25 IST)
పైనాపురంలో అక్ర‌మ మట్టి తవ్వకాలను ఆపాల‌ని, ముత్తుకూరు అధికారులకు ఇరిగేషన్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముత్తుకూరు మండల టీడీపీ నాయకుల ఫిర్యాదుతో స్పందించి, ఈ చర్యల‌ను తీసుకున్నారు. ముత్తుకురు మండలంలోని పైనాపురం చెరువులో గత కొంత కాలంగా యథేచ్చగా మట్టి తవ్వకాలు, మండల అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. దీనితో జిల్లా ఇరిగేషన్ అధికారులను మండల టిడిపి నాయకులు నిల‌దీశారు.
 
 నెల్లూరు నగరంలోని ఇరిగేషన్ కార్యాలయంలో ఆ శాఖ ఎస్ఈకి అక్రమాలను వివరించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల‌ను సైతం బేఖాత‌రు చేస్తూ, స్వలాభం కోసం వైసిపి నాయకుడు మట్టిని అక్రమంగా తరలించి డంప్ చేస్తున్నార‌ని, యథేచ్ఛగా అక్రమంగా చెరువు మట్టిని తరలిస్తుంటే అధికారులు మిన్నకుండడం సిగ్గుచేటన్నారు. 460 ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే పైనాపురం చెరువు కనుమరుగయ్యేలా మట్టి తవ్వకాలు జరుగుతున్నా స్పందించరా అని అధికారుల‌ను నిల‌దీశారు. 
 
త‌క్షణమే స్పందించకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. అక్రమ మైనింగ్ కు పాల్పడిన వైసీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకుల ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఇరిగేష‌న్ అధికారులు హామీ ఇచ్చారు. పైనాపురం చెరువులో మట్టి తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని మండల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 
 
ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల పార్టీ అధ్యక్షులు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, తెలుగు యువత అధ్యక్షులు ఈపూరు మునిరెడ్డి, సీనియర్ నాయకులు ఏకొల్లు కోదండయ్య, విష్ణువర్ధన్ రావు, సురేష్ రెడ్డి, దీనయ్య, శ్రీధర్ రెడ్డి,మరియు కాంతారావు, జనార్దన్, శ్రీనివాసులు, ఏడుకొండలు, రమేష్, రాజేష్ ,తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు