గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తి.. కరోనా భయంతో దగ్గరకురాని ప్రజలు

బుధవారం, 25 మార్చి 2020 (11:34 IST)
కరోనా వైరస్ ప్రజలను ఎంతో భయభ్రాంతులకు గురిచేసింది. ఇతర అనారోగ్య కారణాలతో చనిపోయినప్పటికీ.. ఆ శవం దగ్గరకు వచ్చేందుకు ప్రజలు భయపడిపోతున్నారు. ఇందుకు నిదర్శనమే కరీంనగర్ జిల్లా రైతు బజార్‌లో సంభవించిన ఓ ఘటన. ఈ మార్కెట్‌లో ఓ వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచారు. కానీ, అతని వద్దకు వచ్చేందుకు ఏ ఒక్కరూ సాహసం చేయలేకపోయారు. అతను కరోనా వైరస్ కారణంగానే చనిపోయారనే భయంతో ఒక్కరు కూడా సమీపానికి రాలేదు. ఈ దయనీయ పరిస్థితి కరీంనగర్‌లో చోటుచేసుకుంది. 
 
నిజానికి కరీంనగర్ జిల్లాకు వచ్చిన ఇండోనేషియా వాసులకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు తమకు సోకుతుందేమోనని భయపడుతున్నారు. ఆ జిల్లాలోని కాశ్మీర్‌గడ్డ రైతు బజార్‌కు బుధవారం కూరగాయల కోసం ఓ వ్యక్తి వచ్చి, వాటిని కొంటోన్న సమయంలో అతడికి గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడే మృతి చెందాడు. 
 
అయితే, ఆ మృతదేహం వద్దకు రావడానికి కూడా స్థానికులు భయపడ్డారు.. దూరంగానే ఉండిపోయారు. చివరకు ఒకరు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని సమాచారం చేరవేశారు. ఆ తర్వాత 104కు సమాచారం అందించి ఆ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు