దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 562 - విశాఖలో ఖైదీలకు విముక్తి?

బుధవారం, 25 మార్చి 2020 (11:07 IST)
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. దీన్ని రుజువు చేశాలా దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. బుధవారం మధ్యాహ్నానికి దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 562కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం 512 మంది బాధితులకు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. మహారాష్ట్రలో మరో ఐదుగురికి ఈ వైరస్ సోకింది. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 112కు చేరింది. 
 
మరోవైపు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39కి చేరింది. తాజాగా భద్రాద్రి కొత్తగూడం పాజిటివ్ వచ్చిన యువకుడితో కలిసి ఉన్న మరో ఇద్దరికి కరోనా వచ్చినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ తెలిపింది. భద్రాద్రి కొతగూడానికి చెందిన 57 ఏళ్ల వ్యక్తికి, మరో వృద్ధురాలికి కరోనా సోకినట్లు వివరించింది. దీంతో తెలంగాణలో ప్రైమరీ కాంటాక్ట్ కరోనా కేసుల సంఖ్య 5కు చేరింది.
 
ఇదిలావుండగా, ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన జైళ్లనూ తాకింది. ఇప్పటికే విశాఖ సెంట్రల్ జైలు, ఖైదీలతో కిక్కిరిసి ఉండగా వారిని కలిసేందుకు వచ్చే బంధువుల ములాఖత్‌ల కారణంగా వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకవచ్చన్న ఆందోళన నెలకొంది.
 
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రిమాండ్‌ ఖైదీలతో పాటు వివిధ రకాల కేసుల్లో ఏడు సంవత్సరాలలోపు శిక్షను అనుభవిస్తున్న ఖైదీలను బెయిల్‌‌పై విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జైలు వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం జైలులో నిబంధనల మేరకు బెయిల్‌కు అర్హులైన వారు 250 మంది వరకూ ఉంటారని, వారి విడుదలపై అతి త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని జైలు అధికారి ఒకరు తెలియజేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు