తాను దేశం కోసం చనిపోతానని, తన మాటలు వాస్తవరూపం దాలిస్తే తన భౌతికకాయంపై జాతీయ జెండాను కప్పాలంటూ మురళీ నాయక్ తన చివరి మాటలుగా చెప్పేవాడని అతని మేనమాన తాజాగా వెల్లడించాడు. పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ వీరమరణం పొందిన విషయం తెల్సిందే. ఈ మృతి వార్త తెలియగానే ఆయన కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.
కాగా, 'మురళీ నాయక్ మృతిపై ఆయన మేనమామ మాట్లాడుతూ, చనిపోతే దేశం కోసం చనిపోతా... చనిపోయాక నా మృతదేహంపై జాతీయ జెండాను ఉండాలని మురళీ నాయక్ పదేపదే చెప్తూవుండేవాడు. నా మేనల్లుడు దేశం కోసం పోరాడి వీరమరణం పొందినందుకు గర్వపడుతున్నాను. నా ఇద్దరు కుమారులను కూడా దేశం కోసం పోరాడటానికి పంపిస్తానను. పాకిస్థాన్ ఉగ్రవాదులను రెండు రోజులలో పూర్తిగా హతమార్చాలని ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేస్తున్నాను' అని పేర్కొన్నారు.
పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి.. గ్రామంలో విషాదం
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం మొదలైంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో తెలుగు జవాను ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పేరు మురళీ నాయక్. పాక్ సైనికుల కాల్పుల్లో వీరమరణం పొందారు. ఆయన స్వస్థలం ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండా వాసి.
వీర జవాన్ మరణ వార్త తెలియగానే కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థలు గుండెలవిసేలా రోదిస్తున్నారు. అలాగే, వీర జవాన్ మురళీ నాయక్ ఇంటి వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. మురళీ నాయక్ మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. కాగా, మురళీ నాయక్ వీరమరణం పట్ల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు.