రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్ ఒకటో తేదీ నుంచి సినిమా థియేటర్ల బంద్ ఏమీ ఉండదని తెలుగు ఫిల్మ్ చాంబర్ ప్రకటించింది. థియేటర్లకు కూడా పర్సంటేజీ విధానం అమలు చేయాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో శనివారం ఫిల్మ్ చాంబర్లో సినిమా పంపిణీదారులు, ఎగ్జిబిటర్లతో నిర్మాతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు. ఆ తర్వాత ఫిల్మ్ చాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు.
ఇదే అంశంపై మాట్లాడుతూ, థియేటర్ల బంద్ అనేది తప్పుగా చిత్రీకరించారు. చల్చలు జరగకపోతే జూన్ ఒకటో తేదీ నుంచి అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని మాత్రమే నిజం. కానీ, థియేటర్లు మూసి వేస్తారన్న సమాచారాన్నే ప్రచారం చేశారు. ప్రస్తుతం అలాంటిదేమీ లేదు. కేవలం ఒక్క సినిమాను దృష్టిలో పెట్టుకుని థియేటర్లను బంద్ చేస్తున్నామనడం సరికాదు. కొన్ని వార్తలు బిజినెస్ను దెబ్బతీస్తాయి. చిత్రపరిశ్రమలో వంద సమస్యలు ఉన్నాయి.
అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటీ పరిష్కరించుకుంటూ రావాలి. థియేటర్ల పర్సంటేజీ విషయమై కొన్నేళ్లుగా ఎలాంటి చర్చ జరగలేదు. ప్రస్తుతం జరుగుతోంది. తర్వాత రోడ్ మ్యాప్ ఏంటనేది నిర్ణయిస్తాం. మూడు సెక్టార్ల నుంచి కమిటీ వేస్తున్నాం. నిర్ణీత సమయంలోగా సమస్యలు పరిష్కరించుకుంటాం. ఈ నెల 30వ తేదీన జరిగే సమావేశంలో కమిటీ ఎవరనేది నిర్ణయిస్తాం అని తెలిపారు.
అలాగే, జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ అనే ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు. తెలుగు ఫిల్మ్ చాంబర్, దాని ప్రతినిధుల నుంచి వచ్చే సమాచారమే ఆధీకృతం. దానికి మేము సమాధానాలు చెబుతాం. ఎవరెవరి దగ్గరి నుంచో మీడియా అభిప్రాయాలు తీసుకుని వార్తలను ప్రసారం చేస్తున్నాయి. ఫిల్మ్ చాంబర్లో ఏం జరుగుతుందో తెలుసుకుని వార్తలు రాస్తే మంచిది. చిత్రపరిశ్రమలోని అన్ని వర్గాలను త్వరలోనే కలుస్తాం. వీలైనన్ని సమస్యలను మేమే పరిష్కరించుకుంటాం. మిగిలిన వాటి విషయంలోనూ ప్రభుత్వంతో చర్చిస్తాం అని తెలిపారు.