ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దేవభూమిగా భాసిల్లే పుణ్యభూమి కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్నాథుడుని దర్శనం చేసుకునేందుకు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడకు తరలివస్తుంటారు. భారీ మంచు కారణంగా సుధీర్ఘకాలం మూసివుండే ఈ పుణ్యక్షేత్రం శుక్రవారం తెరుచుకుంది. శుక్రవారం ఉదయం 7 గంటలకు వేద మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు ఆలయం తలుపులు తెరిచారు. ఈ సందర్భంగా భక్తులపై హెలికాఫ్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. తలుపులు తెరుచుకోనున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని పూలతో అందంగా అలంకరించారు. ఇందుకోసం 13 టన్నుల పూలను వినియోగించారు.
కేదార్నాథ్ తలుపులు తెరుచుకోవడంతో చార్ధామ్ యాత్ర సీజన్ ప్రారంభమైనట్టయింది. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను చార్ధామ్ క్షేత్రాలుగా పిలుస్తారు. యమునోత్రి, గంగోత్రి ధామాలు ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ రోజున తెరవగా, బద్రీనాథ్ ఆలయాన్ని మాత్రం ఈ నెల 4వ తేదీన తెరుస్తారు. కేదార్నాథ్ ఆలయం మాత్రం శుక్రవారం తెరుచుకుంది.
మరోవైపు, ఇటీవల పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ చార్ధామ్ యాత్ర కొనసాగే మార్గంలో పోలీసులు, భద్రతా బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని భక్తులకు అధికారులు విజ్ఞప్తి చేశారు.