భూమన కరుణాకర్ రెడ్డి ఎంతగా ప్రయత్నించినప్పటికీ తిరుపతి డిప్యూటీ మేయర్ పదవిని కూటమి ప్రభుత్వం తన్నుకెళ్లింది. తప్పకుండా విజయం సాధిస్తామన్న ధీమాతో వున్న వైసిపికి ఎదురుదెబ్బ తగిలింది. దీనికి కారణం తామేనంటూ వైసిపి కార్పొరేటర్లు భూమన కరుణాకర్ రెడ్డి కాళ్లపై పడి బోరుమంటూ విలపించారు. కూటమి నాయకులు తమను బెదిరించడం వల్ల ఓట్లు వేసామంటూ వారు విలపించారు. ఐతే దీనిపై వైసిపిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చేయాల్సినదంతా చేసేసి ఇక్కడికి వచ్చి దొంగ ఏడుపులు ఎందుకుని అని కొందరు అంటుంటే.. పాపం కూటమి నాయకులకు భయపడిపోయారు కార్పొరేటర్లు అంటూ మరికొందరు అంటున్నారు.
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో టీడీపీ డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకుంది. డిప్యూటీ మేయర్గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్లోని మొత్తం 50 మంది కార్పొరేటర్లలో 47 మంది సభ్యులు ఓటింగ్ ప్రక్రియకు హాజరయ్యారు. తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి, జనసేన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఎక్స్-అఫిషియో సభ్యులుగా పాల్గొన్నారు. ఎన్నికల్లో మునికృష్ణకు 26 ఓట్లు రాగా, వైఎస్సార్సీపీ అభ్యర్థి భాస్కర్రెడ్డికి 21 ఓట్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపు తర్వాత, అధికారులు మునికృష్ణను విజేతగా ప్రకటించారు.
మరోవైపు తన విజయం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంకితం చేస్తున్నట్లు డిప్యూటీ మేయర్ మునికృష్ణ తెలిపారు. తన విజయానికి మద్దతునిచ్చిన కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. కూటమి నేతలు కలిసికట్టుగా పనిచేయడంతోనే తన గెలుపు సాధ్యమైందన్నారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ ఛైర్పర్సన్ స్థానానికి జరిగిన ఎన్నికలో టీడీపీ అభ్యర్థి మండవ కృష్ణకుమారి విజయం సాధించారు.