ప్రేయసిని పెళ్లాడినందుకు ప్రియుడి ఇంటికి నిప్పు పెట్టారు

సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (13:59 IST)
తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడాడన్న అక్కసుతో ప్రియురాలి తరపు బంధువులు ప్రియుడి ఇంటికి నిప్పు పెట్టి ఇంటిని బుగ్గి చేసారు. ఐతే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణహాని జరగలేదు.
 
వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లా నాగసముద్రం మండలంలోని వెంకటాంపల్లికి చెందిన సుమిత్ర అనే యువతి గ్రామ వాలంటీరుగా విధుల నిర్వహిస్తోంది. ఈమె అదే గ్రామానికి చెందిన హేమంత్ తో ప్రేమిస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు యువతి తరుపు పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరూ కలిసి రహస్య వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత రూరల్ పోలీసు స్టేషనుకి వెళ్లి తాము మేజర్లమనీ, వివాహం చేసుకున్నట్లు తెలిపారు. దానితో ఇరు కుటుంబాల పెద్దలను పిలిపించి సర్ది చెప్పి పంపారు.
 
ఐతే అమ్మాయి తరపు బంధువులు ఆగ్రహంతో వుండటంతో పెళ్లి చేసుకున్న నూతన జంటను దూరంగా పంపారు అబ్బాయి తరపు పెద్దలు. కానీ యువతి తరపు బంధువులు మాత్రం ఆగ్రహం పట్టలేక పెళ్లికొడుకు ఇంటిపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. దీనితో ఇల్లు అగ్నికి ఆహుతైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు