రాబోయే వారం రోజులు అత్యంత కీలకం: ఏపీ ఉప ముఖ్యమంత్రి

శనివారం, 25 ఏప్రియల్ 2020 (13:48 IST)
కరోనా నియంత్రణలో రాబోయే వారం రోజులు అత్యంత కీలకమని, ఈ సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి సూచించారు.

శనివారం జియ్యమ్మవలస మండలంలోని తన సొంత గ్రామం చినమేరంగి 1025 లోని కుటుంబాలకు తన వంతు సహాయంగా పంపిణీ చేయనున్న మాస్కులు, శానిటైజర్లను గ్రామ పంచాయతీ వాలంటీర్లకు మంత్రి పుష్ప శ్రీవాణి, వైసిపి అరకు పార్లమెంటరీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్‌ రాజు దంపతులు అందించారు.

ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ... రాబోయే వారం రోజులు ప్రజలు లాక్‌ డౌన్‌ నిబంధనలను కచ్చితంగా పాటించి ఇళ్ల కే పరిమితం కావాలని కోరారు. అత్యవసర పనుల కోసం బయటకు వచ్చినా, కరోనా సోకకుండా మాస్కులను తప్పనిసరిగా ధరించాలని, ఎక్కడికి వెళ్లినా భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు.

అనవసరంగా రోడ్ల మీదకు వచ్చేవారిని పోలీసులు అవసరమైతే అదుపులోకి తీసుకోవడంతో పాటుగా వారి వాహనాలను కూడా జప్తు చేసే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఈ వారం రోజులు అప్రమత్తంగా లేకపోతే ఇంతకాలం పడిన శ్రమంతా వఅధా అవుతుందని గుర్తించాలని ప్రజలకు హితవు పలికారు.

అధికారులు కూడా ఈ వారం రోజులు మరింత కట్టుదిట్టంగా, కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. కరోనా మహమ్మారిని నియంత్రించడానికి ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటుగా లాక్‌ డోన్‌ నిబంధనలను పాటించేలా చూడాలని, శానిటైజర్లను ఏ విధంగా ఉపయోగించాలన్న విషయంగా ప్రజలకు అవగాహన కలిగించాలని వాలంటీర్లను పుష్ప శ్రీవాణి కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు