"అర్జున్ రెడ్డి" వల్లే గుర్తింపు - క్రేజ్ వచ్చింది : షాలినీ పాండే

ఠాగూర్

మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (10:58 IST)
గత 2017లో తెలుగు చిత్రపరిశ్రమలో విడుదలై సంచలనం సృష్టించిన 'అర్జున్ రెడ్డి' చిత్రంతో షాలినీ పాండే హీరోయిన్‌గా పరిచయమయ్యారు. విజయ్ దేవరకొండ సరసన ఆమె నటనకుగాను ప్రేక్షకుల నుంచి విశేషమైన ప్రశంసలు దక్కాయి. ఆ సినిమా తన కెరీర్‌ను మలుపుతిప్పిందని వెల్లడించారు. ఆ చిత్రంతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపూ, క్రేజ్‌ వచ్చిందని చెప్పుకొచ్చారు. ఆ సినిమా విజయం తనకు ఒత్తిడి కంటే ఎక్కువగా ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని ఆమె స్పష్టం చేశారు.
 
ఇదే అంశంపై ఆమె తాజాగా మాట్లాడుతూ, 'ఆ సినిమా చేస్తున్నప్పుడు మేమంతా కొత్తవాళ్లం. అది మా అందరికీ దాదాపు మొదటి సినిమా. అందరం కలిసి ఒక మంచి సినిమా చేయాలనే తపనతో పనిచేశాం. సినిమా విడుదలై అంత పెద్ద విజయం సాధించిన తర్వాత, నాపై ఒత్తిడి పెరుగుతుందని చాలామంది అనుకున్నారు. 
 
కానీ నిజానికి నాకు నటిగా మంచి గుర్తింపు లభించిందనే భావన కలిగింది. నటి కావాలన్న నా కోరిక నెరవేరినందుకు ఎంతో సంతోషంగా అనిపించింది. ఆ సమయంలో ఒత్తిడిని ఎలా తీసుకోవాలో కూడా నాకు తెలియదు. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాగే మంచి సినిమాలు చేయాలని మాత్రమే అనుకున్నాను' అని వివరించారు.
 
ఇకపోతే, తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ, "దేవుడి దయవల్ల, ఒక నటిగా నా ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగుతోంది. 'అర్జున్ రెడ్డి' లాంటి ఒక మంచి ప్రాజెక్టుతో నా కెరీర్ మొదలైంది. ఆ చిత్రంలో నేను పనిచేసిన వ్యక్తులు, నాకు అండగా నిలిచిన టీమ్ వల్లే ఆ ప్రయాణం మరింత ప్రత్యేకంగా మారింది. అప్పటి నుంచి నేను పనిచేసిన సినిమాల్లో కూడా మంచి నటులు, దర్శకులతో పనిచేసే అవకాశం లభించింది. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని" అని ఆమె తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు