ఎన్నికల ప్రక్రియ మొత్తం రీషెడ్యూల్ చేయాలి: టీడీపీ

సోమవారం, 16 మార్చి 2020 (07:45 IST)
ఎన్నికల ప్రక్రియను మొత్తం రీషెడ్యూల్ చేయాలని తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది. నామినేషన్ల ప్రక్రియలో అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడిందని ఎమ్మెల్సీలు దీపక్ రెడ్డి, అశోక్​బాబు, బుద్దా వెంకన్న ఆరోపించారు. తమ పార్టీ అభ్యర్థులు చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మాచర్ల ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల ప్రక్రియను మొత్తం రీషెడ్యూల్ చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయనివ్వలేదని ఆరోపించారు. విజయవాడలో ఆ పార్టీ ఎమ్మెల్సీలు దీపక్ రెడ్డి, అశోక్​బాబు, బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఉచ్చులో కొందరు అధికారులు పడ్డారని ఆరోపించారు. వారిపై విచారణ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

తప్పు చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలి డోన్‌, మాచర్లలోనూ తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్‌ వేయనివ్వలేదని దీపక్ రెడ్డి అన్నారు. నామినేషన్‌ విత్‌డ్రా చేసుకోవాలని బెదిరిస్తున్నారని అన్నారు.

తాము చేసిన ఫిర్యాదులు అన్నింటిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. అవసరమైనతే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని చెప్పారు. 

పిన్నెల్లిని ఎందుకు అరెస్ట్ చేయలేదు
బుద్దా వెంకన్న మాచర్ల ఘటనలో పిన్నెల్లిని ఏ1గా చేర్చాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. మిగతా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటివరకు పోలీసులు...తమ నుంచి ఎలాంటి అభిప్రాయాలు తీసుకోలేదని ఆరోపించారు. పిన్నెల్లిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

మాచర్లలో ఏకగ్రీవాలను రద్దు చేయాలని ఈసీని కోరారు. మాచర్ల ఘటనపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. అధికారులు అన్ని విషయాలు ఆలోచించుకుని పని చేయాలని సూచించారు. ఇవాళ ఈసీ తీసుకున్న చర్యలు.. ప్రభుత్వానికి చెంపపెట్టు అని అభివర్ణించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు