ఆ ముగ్గురి హత్యకు వైసీపీ ప్రయత్నం: చంద్రబాబు

గురువారం, 12 మార్చి 2020 (06:23 IST)
తమ పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, అధికార ప్రతినిధి బొండా ఉమామహేశ్వరరావు, న్యాయవాది కిశోర్‌లను హత్య చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.

మాచర్లలో పై ముగ్గురిపై వైసీపీ నేతల దాడి ఘటన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. పల్నాడులోనే కాదు, రాష్ట్రమంతా ఇలాగే జరుగుతోందన్నారు. కశ్మీర్‌, బిహారుల్లో కూడా ఇలాంటి దుర్మార్గాలు చూడలేదన్నారు. పరిస్థితులు ఇలా ఉంటే డీజీపీ ఏం చేస్తున్నారని నిలదీశారు.

"మాచర్లలో దాడి జరగకముందే గుంటూరు ఎస్పీతో మాట్లాడాను. మాచర్లలో చాలా దారుణంగా ఉంది. నామినేషన్లు లేవు.. మీరు చర్యలు తీసుకోవాలని చెప్పాను. కానీ ఆయనేం చర్యలు తీసుకోలేదు. ఆయనతో మాట్లాడిన రెండు గంటలకే దాడి జరిగింది. కనీసం అప్పుడైనా ఫోన్‌చేసి.. ఇలా జరిగినందుకు బాధపడుతున్నాను.. రక్షణ కల్పిస్తానని కూడా చెప్పలేదు. రెండు, మూడు సార్లు ఫోన్‌ చేస్తే తప్ప లైన్‌లోకి రాలేదు. మరోవైపు డీజీపీకి కూడా ఫిర్యాదు చేశాం.

కనీసం మర్యాదగానైనా ఈ సంఘటన పట్ల బాధపడుతున్నామని చెప్పలేదు. ఇదేనా దుండగులను శిక్షించే విధానం? ఇదేనా జనాన్ని రక్షించే పద్ధతి? ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి వెళ్లిన వాళ్లు చనిపోవాలా? ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని? రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తారా? అడ్డం వచ్చినవాళ్లపై దాడులు చేస్తారా?

పోలీసు వాహనాలపై దాడిచేసే ధైర్యం వచ్చిందంటే ఏం చేయాలి? నేను ప్రతి నిమిషం పిటిషన్లు పెట్టుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేయాలా? నామినేషన్లు వేయడానికి స్వేచ్ఛ లేదా? నా జీవితంలో ఈ తరహా ఎప్పుడూ చూడలేదు. ఇది చూశాకైనా ప్రజల్లో కనువిప్పు కలగాలి. రాజకీయ పార్టీలు ఆలోచించాలి. రాష్ట్రాన్ని కాపాడుకుంటారా? శాశ్వతంగా తాకట్టు పెట్టేస్తారా? ఈ సమస్యను ప్రజల కోర్టులో పెడుతున్నాం" అని చంద్రబాబు  పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు