ఆ కోవర్టు ఎవడో కానీ ఎర్రిపప్పను చేశాడు సాయిరెడ్డి : బీజేపీ

సోమవారం, 20 జులై 2020 (15:54 IST)
వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు రామ్ కుమార్ యార్లగడ్డ గట్టి కౌంటర్ ఇచ్చారు. మా పార్టీలో ఉన్న కోవర్టు ఎవడో కానీ.. మీకు తప్పుడు సమాచారం ఇచ్చి.. ఎర్రి పప్పను చేశాడు అంటూ కౌంటరిచ్చాడు. 
 
ప్రస్తుతం మూడు రాజధానుల బిల్లును ఏపీ సర్కారు గవర్నర్‌ హరిచందన్‌కు పంపించింది. దీంతో మూడు రాజధానుల బిల్లు ప్రస్తుతం గవర్నరో కోర్టులో ఉంది. ఈ బిల్లును ఆమోదించవద్దని ఒక్క వైపాకా మినహా మిగిలిన విపక్ష పార్టీలన్నీ గవర్నర్‌కు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇదే అంశంపై గవర్నరుతో పాటు.. బహిరంగ లేఖను కూడా రాశాయి. అలా లేఖలు రాసిన వారిలో బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ కూడా ఉన్నారు. 
 
దీనిపై కన్నా లక్ష్మీనారయణను ఉద్దేశిస్తూ విజయసాయి రెడ్డి ఓ ట్వీట్ చేశారు. చంద్రబాబు కోవర్టు అని మళ్ళీ స్పష్టమైందంటూ పేర్కొన్నారు. సొంత పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా చంద్రబాబుకి అనుకూలంగా రాజధాని బిల్లు ఆమోదించవద్దని గవర్నర్‌కి లేఖ రాశారని గుర్తుచేశారు. 'ఈ విషయమై పార్టీ అధిష్టానం ఆగ్రహించింది. ఇంకా ఎన్నాళ్ళు ఈ ముసుగు కన్నా' అంటూ ఆ ట్వీట్‌లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 
 
దీనిపై బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు రామ్ కుమార్ యార్లగడ్డ ట్విట్టర్ వేదికగా విజయసాయికి కౌంటర్ ఇచ్చారు. రాజధాని అంశంపై గవర్నర్‌కు కన్నా లేఖ రాయడాన్ని పార్టీ అధిష్ఠానం తప్పుబట్టిందన్న విజయసాయి ట్వీట్‌ స్క్రీన్ షాట్‌ను అప్‌లోడ్ చేస్తూ.. 'మా పార్టీలో ఉన్న కోవర్టు ఎవడో కానీ నీకు తప్పుడు సమాచారం ఇచ్చి.. ఎర్రి పప్పను చేశాడు' అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇవన్నీ తప్పుడు కథనాలు అంటూ విజయసాయి ట్వీట్‌కు కేంద్ర పార్టీ సమాధానమిదేనని ఆయన ట్వీట్ చేశారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు