తిరుమల దర్శన టిక్కెట్లు ఆన్ లైన్లో అలానే వుంటున్నాయి, తీసుకున్న భక్తులు రావడంలేదు

గురువారం, 6 మే 2021 (16:28 IST)
తిరుమల శ్రీవారి దర్సనం దొరకడమన్నది చాలా కష్టంతో కూడుకున్న పని. కరోనా సమయం కాకుండా మామూలు సమయంలో అయితే ఉచిత దర్సనం, టోకెన్ల దర్సనం, విఐపి దర్సనం, సేవల ఇలా ఒకటేమిటి.. ఎన్నో విధాలుగా సామాన్యులు, విఐపిలు దర్సించుకుంటూ ఉండేవారు. 
 
కరోనా సమయంలో అయితే సేవా టిక్కెట్లను కుదించడంతో పాటు ఆఫ్ లైన్ ద్వారా ఇచ్చే టోకెన్లను నిలిపివేసింది టిటిడి. ఇదంతా ఇలా ఉంటే టోకెన్ తీసుకున్న భక్తులు తిరుమలకు రావడం లేదట. ప్రతిరోజు ఆన్ లైన్లో 15 వేల టోకెన్లను టిటిడి ఇచ్చింది.. ఇస్తోంది.
 
ఈ నెల దర్సనానికి సంబంధించిన టోకెన్లను గత నెల విడుదల చేసింది. ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు టోకెన్లను ఆన్ లైన్లో 300 రూపాయలు చెల్లించి కొనుగోలు చేశారు. అయితే టోకెన్లు పొందిన భక్తులు దర్సనానికి రావడానికి ఆసక్తి చూపించడం లేదట. 
 
గత నెల 20వ తేదీ నుంచి ఆన్ లైన్లో మే మాసానికి సంబంధించిన దర్సన టిక్కెట్లను అందుబాటులో ఉంచింది టిటిడి. అయితే టోకెన్లు తీసుకున్న భక్తులు ఒకవైపు దర్సనానికి రాకపోవడంతో పాటు మరోవైపు ఆన్లైన్లో టిక్కెట్లను బుక్  చేయడానికి కూడా ఇష్టం పడడం లేదట. టిటిడి ఆన్లైన్లో ఉంచిన టోకెన్లలో 40 శాతం మాత్రమే భక్తులు ఇప్పటి వరకు పొందారట. మిగిలిన 60 శాతం టోకెన్లు అలాగే ఉండిపోయాయట.
 
సాధారణమైన పరిస్థితుల్లో అయితే ఆన్లైన్లో టిక్కెట్లు విడుదల చేసిన వెంటనే రెండు, మూడు గంటల్లోనే హాంఫట్ అంటూ కనిపించకుండా పోతాయి. అలాంటిది ఎప్పుడు సైట్ ఓపెన్ చేసినా ఇప్పుడు టిక్కెట్లు మాత్రమే అలాగే కనిపిస్తున్నాయట. ఇలాంటి పరిస్థితి గతంలో మొదటి దశ కరోనా సమయంలోను, ప్రస్తుత రెండవ దశ కరోనా వేవ్‌లో కనిపిస్తోందంటున్నారు టిటిడి ఉన్నతాధికారులు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు