ఎమ్మెల్యేగా గెలవలేని పప్పుముద్దు నారా లోకేశ్ : ఆర్కే రోజా

ఆదివారం, 28 జూన్ 2020 (09:58 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఎమ్మెల్యేగా గెలవలేని నారా లోకేశ్ ఓ పప్పు ముద్దు అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. 
 
ఇదే అంశంపై ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేశ్ ఓ దద్దమ్మని అభివర్ణించారు. పనీపాటా లేని లోకేశ్, తిన్నది అరగక అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. అవినీతికి పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటుంటే, వారిని పరామర్శించేందుకు చంద్రబాబు, లోకేశ్ పరిగెత్తుకుంటూ ఏపీకి వచ్చారని ఆరోపించారు.
 
ముఖ్యంగా, ప్రజలంతా కరోనా వైరస్ భయాందోళనలో ఉన్న వేళ, దగ్గరుండి భరోసాను ఇవ్వాల్సిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తన కుమారుడు లోకేశ్‌తో కలిసి పక్క రాష్ట్రానికి పారిపోయి, దాక్కున్నారని ఆమె ఆరోపించారు. 
 
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాది వ్యవధిలోనే ఇచ్చిన హామీలను జగన్ అమలు చేశారని, కరోనా విషయంలోనూ ఎంతో ముందుచూపుతో వ్యవహరించారని, ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తూ, వైద్యాన్ని కూడా ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. 
 
కరోనా కట్టడి విషయంలో మిగతా రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలిచిందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, పలు రకాల సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని రోజా వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు