ఏపీలో తొలిసారి : వైకాపా ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

మంగళవారం, 23 జూన్ 2020 (11:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి ఓ ప్రజాప్రతినిధికి కరోనా వైరస్ సోకింది. ఆయన అధికార వైకాపాకు చెందిన ఎమ్మెల్యే. పేరు కడుబండి శ్రీనివాసరావు. విజయనగరం జిల్లా ఎస్.కోట సెగ్మెంట్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 
 
గత రెండు మూడు రోజులుగా ఆయన అనారోగ్యం బారిన పడగా, పరీక్షించిన వైద్యులు, కరోనా లక్షణాలు కనిపించే సరికి నమూనాలు సేకరించి, పరీక్షలు జరిపించారు. దీంతో ఆయనకు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. 
 
ఆ వెంటనే ఆయన గన్‌మెన్‌కు పరీక్షలు జరిపించగా, ఆయనకూ వైరస్ సోకినట్టు తేలింది. ప్రస్తుతం కడుబండిని చికిత్స నిమిత్తం విశాఖపట్నంలోని ఓ గెస్ట్ హౌస్‌కు తరలించారు. ఆయన కుటుంబ సభ్యులను క్వారంటైన్ చేసి, కరోనా టెస్ట్‌లు జరిపించాలని నిర్ణయించిన వైద్యాధికారులు, అందరి నమూనాలనూ సేకరించారు.
 
కాగా, ఈయన కొన్ని రోజుల క్రితం అమెరికాలో పర్యటించి రాష్ట్రానికి వచ్చారు. ఆ సమయంలో అందరు విదేశీ ప్రయాణికులకు చేసినట్టే, ఆయనకూ వైద్య పరీక్షలు చేశారు. ఆయనలో వైరస్ లక్షణాలు అప్పుడు కనిపించలేదు. 
 
ఆ తర్వాత ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. కానీ, రాజ్యసభ ఎన్నికల కోసం అసెంబ్లీకి వచ్చి ఓటు వేశారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఎందరో పార్టీ నాయకులు, కార్యకర్తలను కడుబండి శ్రీనివాసరావు కలసుకోవడంతో, ఆ పార్టీలో ఇప్పుడు కలకలం రేగింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు