ముగ్గురు వైద్యుల కోర్కె తీర్చలేకే యువ డాక్టర్ సూసైడ్

ఆదివారం, 11 నవంబరు 2018 (07:33 IST)
తిరుపతిలోని ఎస్వీఎంసీకి చెందిన జూనియర్ వైద్యురాలు డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసులోని నిజాలు నిగ్గుతేలాయి. ఈ కేసును విచారించిన సీఐడీ అధికారులు... ముగ్గురు కామాంధ డాక్టర్ల లైంగిక కోర్కెలు తీర్చలేకే శిల్ప బలవన్మరణానికి పాల్పడినట్టు తేల్చారు. ఈ విషయాన్ని సీఐడీ డీఎస్పీ అమ్మిరెడ్డి మీడియాకు వెల్లడించారు. 
 
ఈ యేడాది ఆగష్టు 7వ తేదీన తన ఇంట్లో శిల్ప ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఈ ఆత్మహత్య ఘటనపై డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దాంతో ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. దీనిలో భాగంగా సీఐడి విచారణను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. డాక్టర్ శిల్పను ముగ్గురు ప్రొఫెసర్లు రవికుమార్, శశికుమార్, కిరీటీ లైంగికంగా వేధింపులకు గురిచేశారని సీఐడీ నివేదిక తేల్చింది. ముఖ్యంగా, వీరి లైంగిక కోర్కెలు తీర్చలేకే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తేల్చారు. 
 
ఈ ఘటనకు సంబంధించి 47 మందిని విచారించినట్లు అమ్మిరెడ్డి పేర్కొన్నారు. అదే సమయంలో డిజిటల్‌ ఆధారాలు , సిట్‌ దర్యాప్తు బృందం, వివిధ కమిటీల రిపోర్టులను సేకరించినట్లు అమ్మిరెడ్డి స్పష్టం చేశారు. శిల్ప మైగ్రేన్‌తో తీవ్రంగా బాధపడుతూ ఉండేదని, ఈ క్రమంలోనే వైద్యుల లైంగిక వేధింపులు తోడవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు. శిల్ప మరణానికి భర్త, బంధువులకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు