ఏపీకి కేంద్ర మరో రెండు వరాలు.. కొప్పర్తి - ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ హబ్‌లు!

ఠాగూర్

గురువారం, 29 ఆగస్టు 2024 (08:55 IST)
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో రెండు వరాలు ప్రకటించింది. రాష్ట్రంలోని కొప్పర్తి, ఓర్వకల్లు ప్రాంతాల్లో రెండు భారీ పారిశ్రామికవాడలను నెలకొల్పనున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కడప జిల్లా కొప్పర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో భారీ ఇండస్ట్రియల్ హబ్‌లు వస్తున్నాయని వెల్లడించారు. 
 
ఓర్వకల్లులో 2621 ఎకరాల్లో ఈ పారిశ్రామికవాడను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ ప్రాజెక్టు వ్యయం రూ.2786 కోట్లుగా ఉంటుందని తెలిపారు. ఈ పారిశ్రామిక హబ్‌లో రూ.12 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, దీని ద్వారా 45 వేల మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు.
 
అదేవిధంగా కొప్పర్తి పారిశ్రామికవాడను 2596 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ హబ్ నిర్మాణం కోసం రూ.2137 కోట్లు ఖర్చు చేస్తామని, ఈ హబ్ ద్వారా 54 వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. రాష్ట్రానికి రెండు పారిశ్రామికవాడలను ప్రకటించిన కేంద్రానికి ఏపీ ప్రభుత్వం ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో అభినందలు తెలియజేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు