అర్చకులకు గుడ్ న్యూస్.. వేతనాలు రూ.10వేల నుంచి 15వేలకు పెంపు

సెల్వి

బుధవారం, 28 ఆగస్టు 2024 (16:39 IST)
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆలయాల్లో పనిచేస్తున్న 1,683 మంది అర్చకుల వేతనాలను నెలకు రూ.10,000 నుంచి రూ.15,000కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఈ చర్యతో రాష్ట్ర ఖజానాపై ఏడాదికి రూ.10 కోట్ల అదనపు భారం పడనుంది.
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ధూప దీప నైవేద్యం పథకం కింద చిన్న ఆలయాలకు అందించే ఆర్థిక సాయాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రూ.32 కోట్ల అదనపు భారం పడనుంది.
 
వేద విద్య చదివి నిరుద్యోగులైన యువతకు రూ.3,000 నెలసరి భృతి అందించేందుకు ఆమోదం లభించింది. నాయీ బ్రాహ్మణులకు కనీస నెలసరి వేతనం రూ. 25,000 కూడా నాయుడు ప్రకటించారు. ఆలయ ట్రస్టులకు మరో ఇద్దరు బోర్డు సభ్యులను చేర్చుకోవాలని నిర్ణయించారు.

రూ.20 కోట్లు, అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న ఆలయాల్లో ట్రస్టు బోర్డులో 15 మంది సభ్యులున్నారు. ఇప్పుడు ఆ సంఖ్యను 17కు పెంచుతామని.. ఎన్నికల ముందు ఎన్డీయే ఇచ్చిన హామీ మేరకు ట్రస్టు బోర్డులో బ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణులు సభ్యులుగా ఉంటారని స్పష్టం చేశారు.
 
ఆర్యవైశ్య కమ్యూనిటీ సంస్థల అభ్యర్థన మేరకు, వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మారాపన చేసిన రోజును గుర్తించి, ప్రతి సంవత్సరం సంబంధిత కర్మలను నిర్వహించాలని ముఖ్యమంత్రి దేవాదాయ శాఖను ఆదేశించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు