ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో తెలుగు విద్యార్థుల సత్తా

ఆదివారం, 2 జులై 2023 (09:54 IST)
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) పరీక్షల్లో తెలుగు యువకులు సత్తా చాటారు. బాపట్లకు చెందిన వెంకట శ్రీకాంత్ జాతీయ స్థాయిలో అగ్ర స్థానంలో నిలిచాడు. అలాగే, అన్నమయ్య జిల్లా పెద్ద మండ్యం మండలానికి చెందిన నారా భువనేశ్వర్ 31వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. వీరిద్దరూ రెండో ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించడం గమనార్హం. ఐఎఫ్ఎస్ పరీక్షా ఫలితాలు శనివారం విడుదలైన విషయం తెల్సిందే. 
 
ఈ సందర్భంగా శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. తనకు పర్యావరణ సంబంధమైన విషయాలపై ఆసక్తి ఎక్కువని, అందుకే ఈ విభాగాన్ని ఎంచుకున్నట్టు చెప్పారు. కాలుష్య నివారణ, జీవవైవిధ్యం, వాతావరణ మార్పులపై పరిశోధన తదితర అంశాలతో పాటు అడవులను కాపాడటానికి కృషి చేస్తానని చెప్పారు. 
 
అయితే, తనకు తొలి ర్యాంకు వస్తుందని ఊహించలేదని, చాలా ఆనందంగా ఉందన్నారు. మొదటి ర్యాంకు వచ్చింది కనుక ఆంధ్ర కేడర్ ఎంచుకునే అవకాశం ఉంటుందని శ్రీకాంత్ తెలిపారు. కాగా, భువనేశ్వర్ గతేడాది మొదటిసారిగా ఐఎఫ్‌ఎస్ పరీక్షలు రాయగా అర్హత సాధించలేదు. అనంతరం పట్టుదలతో మళ్లీ పరీక్షలకు హాజరై ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు