వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ర‌ణ‌రంగ‌మే! రాధా వ‌ర్సెస్ అవినాష్‌!!

సోమవారం, 20 డిశెంబరు 2021 (20:02 IST)
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎప్పటి నుంచో దేవినేని, వంగవీటి వర్గాల మధ్య పోరు కొనసాగుతోంది. గతంలో టీడీపీలో ఈ రెండు కుటుంబాలు ఉండగా కూడా ఉప్పునిప్పుగా ఉండేవారు. కానీ చంద్రబాబు సర్దిచెప్పడంతో కొంతకాలం కలిసి పనిచేస్తున్నట్లు కనిపించారు. అయితే దేవినేని అవినాష్ వైసీపీకి వెళ్లిపోవడంతో అక్కడ ఉన్న వంగవీటి రాధా టీడీపీకి వచ్చేశారు.


ఇప్పుడు చంద్రబాబు కొత్త సమీకరణాలతో వీరిద్దరూ తొలిసారి తూర్పు నియోజకవర్గం నుంచి ముఖాముఖీ పోరులో తలపడే అవకాశం దక్కబోతోంది. రాజకీయాల్లో జూనియర్ గా ఉన్న అవినాష్ తో పోలిస్తే స్ధానికంగా ఉన్న కుల సమీకరణాలు రాధాకే అనుకూలంగా ఉండే అవకాశముంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.
 
 
గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బలంగా వీచిన వైసీపీ పవనాల్ని తట్టుకుని టీడీపీ తరఫున గెలిచిన అతి కొద్ది మంది ఎమ్మెల్యేల్లో ఒకరైన గద్దె రామ్మోహన్ పార్టీ కోరిక మేరకు తన పాత నియోజకవర్గమైన గన్నవరానికి వెళ్లనున్నారు. దీంతో ఆయన సిట్టింగ్ స్ధానంలో వంగవీటి వారసుడైన రాధాను రంగంలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నారు.


వాస్తవానికి గతంలో తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాధాకు గత ఎన్నికల్లో మాత్రం అక్కడ వైసీపీ, టీడీపీ నుంచి కూడా సీటు దక్కలేదు. దీంతో ఆయన ఎప్పటికైనా తిరిగి తూర్పు నుంచే పోటీ చేయాలని పట్టు దలగా ఉన్నారు దీంతో వంగవీటి సేవల్ని గుర్తించి విజయవాడ తూర్పు నుంచి బరిలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు