అండగా నిలబడిన ప్రజలకు మంచి చేయాలనే ఈ యుద్ధం : సీఎం చంద్రబాబు

ఠాగూర్

మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (13:06 IST)
తనపై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేసిన సమయంలో తనకు అండగా నిలబడిన ప్రజలకు మంచిచేయాలన్న తపనతోనే ఈ యుద్ధం చేస్తున్నట్టు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత వైకాపా ప్రభుత్వం చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేసింది. దీనికి సోమవారంతో ఒక యేడాది పూర్తయింది. అరెస్టు చేసిన రోజున ప్రజలు తన వెంట ఉన్నారని ఆయన గుర్తుచేశారు. అరెస్టు చేసిన రోజున తాను బస్సులో ఉన్నానని, ఇపుడు కూడా ప్రజల మధ్య బస్సులోనే ఉన్నానని తెలిపారు. 
 
వరదల్లో మునిగిన విజయవాడ నగరంలో సహాయక చర్యలు సాఫీగా సాగేందుకు వీలుగా ఆయన గత తొమ్మిది రోజులుగా విజయవాడ నగరంలోనే, తన ప్రత్యేక బస్సులోనే ఉంటున్నారు. ఈ క్రమంలో తన అరెస్టుపై ఒక యేడాది పూర్తికావడంపై ఆయన స్పందించారు. అధిక వర్షాలు, గత పాలకుల పాపాలు విజయవాడకు శాపంగా మారాయని ఆవేదన గత యేడాది ఇదే రోజున నాటి వైసీపీ ప్రభుత్వం తనను అక్రమంగా అరెస్టు చేసిందని, ఆ రోజు ప్రజలంతా తన వెంటే నిలిచారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 
 
తనపై అంతటి ఆదరణ చూపిన ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసి పని చేస్తానన్నారు. సోమవారం మరోమారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు కష్టం వస్తే తొమ్మిది రోజులుగా వారి మధ్య బస్సులోనే ఉన్నానన్నారు. వారి మధ్యే ఉంటూ వారి కోసం పని చేస్తానని వ్యాఖ్యానించారు. అధిక వర్షాలు, గత పాలకుల పాపాలు ఇప్పుడు విజయవాడ ప్రజలకు శాపంగా మారాయని ఆవేదన వ్యక్తంచేశారు.  
 
బుడమేరు నుంచి కొల్లేరుకు నీరు వెళ్లకుండా కబ్జా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సర్వశక్తులు ఒడ్డి ప్రజలను కొంతవరకు ఆదుకున్నట్లు చెప్పారు. ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా ఆహారం సరఫరా చేసినట్లు చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించి ప్రజలకు అండగా నిలుస్తామన్నారు.
 
తాము ఇంత చేస్తుంటే వైసీపీ నేతలు మాత్రం తమపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. అయినా తనకు వచ్చిన ఇబ్బంది లేదని... తనకు ఏడు లక్షల మంది వరద బాధితుల కష్టాలే కనిపిస్తున్నాయన్నారు. వరద ప్రాంతాల్లో వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. వరద ప్రాంతాల్లోని ఇళ్లలో వస్తువులన్నీ పాడైపోయినట్లు చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు