ప్రేమ, పెళ్లికి నో చెప్పింది- నర్సుపై ప్రేమోన్మాది బ్లేడుతో దాడి..

వరుణ్

ఆదివారం, 4 ఆగస్టు 2024 (18:07 IST)
తాడేపల్లిలో నర్సుపై ప్రేమోన్మాది బ్లేడుతో దాడి చేశాడు. నర్సుగా పనిచేస్తున్న ఇరవై మూడేళ్ల మహిళపై ఓ ప్రేమోన్మాది చేసిన ఈ బ్లేడ్ దాడి స్థానికంగా కలకలం రేపింది. వడ్డేశ్వరంలోని హాస్టల్ సమీపంలో దుండగుడు ఆమెపై బ్లేడుతో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి గాయాలయ్యాయి. తాడేపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 
 
వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లాకు చెందిన యువతి గత మూడేళ్లుగా ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో నర్సుగా పనిచేస్తోంది. కాలేజీ హాస్టల్‌లో ఉంటూ విధులకు హాజరవుతోంది. ఆదివారం, చర్చి నుండి తిరిగి హాస్టల్‌కి వస్తుండగా క్రాంతి మౌళి అనే యువకుడు ఆమెతో మాట్లాడాలని కోరాడు. ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడు. పెళ్లి చేసుకుందామని అడిగాడు. 
 
కానీ క్రాంతి మౌళి ప్రేమకు నర్సు నో చెప్పింది. ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన క్రాంతి మౌళి బ్లేడ్‌తో దాడి చేసి మెడపై కోసేశాడు. ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 
 
గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు