ఢిల్లీ ఎస్వీ క‌ళాశాల గ‌వ‌ర్నింగ్‌బాడీ ఛైర్మ‌న్‌గా వైవి.సుబ్బారెడ్డి

బుధవారం, 13 మే 2020 (20:16 IST)
ఢిల్లీలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర క‌ళాశాల గ‌వ‌ర్నింగ్‌బాడీ ఛైర్మ‌న్‌గా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన‌ముల ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డిని ఎన్నుకున్నారు. కోశాధికారిగా ఎఫ్ఏసిఏవో ఓ.బాలాజిని ఎన్నుకున్నారు.

తాడేప‌ల్లిలోని ఛైర్మ‌న్ నివాసం నుంచి బుధ‌వారం ఢిల్లీ ఎస్వీ క‌ళాశాల గ‌వ‌ర్నింగ్‌బాడీ స‌మావేశాన్ని వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా నిర్వ‌హించారు. క‌ళాశాల ప్రిన్సిపాల్ డా.పి.హేమ‌ల‌తారెడ్డి మే 31న ఉద్యోగ విర‌మ‌ణ చేయ‌నుండ‌డంతో ఆమె స్థానంలో అసోసియేట్ ప్రొఫెస‌ర్ డా.ఎం.ప‌ద్మాసురేష్‌ను ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా నియ‌మించారు.

ఢిల్లీ యూనివ‌ర్సిటీ నియ‌మ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా నూత‌న‌ ప్రిన్సిపాల్ నియామ‌కం చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. అసోసియేట్ ప్రొఫెస‌ర్ డా.వెంక‌ట్‌కుమార్‌ను వైస్ ప్రిన్సిపాల్‌గా నియ‌మించారు.

ఢిల్లీ యూనివ‌ర్సిటీ నియ‌మ‌నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా క‌ళాశాల‌లో టీచింగ్‌, నాన్ టీచింగ్ సిబ్బంది నియామ‌కాల‌కు సంబంధించిన ప్ర‌క్రియ ప్రారంభించ‌డానికి గ‌వ‌ర్నింగ్‌బాడీ అనుమ‌తి మంజూరు చేసింది.

ఈ కాన్ఫ‌రెన్స్‌లో టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌, ,టిటిడి బోర్డు స‌భ్యులు, క‌ళాశాల గ‌వ‌ర్నింగ్‌బాడీ స‌భ్యులు డా. సుధా నారాయ‌ణ‌మూర్తి, వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి, డా. ఎం.నిశ్చిత‌, డిపి.అనంత‌, డా. బి.పార్థ‌సారథిరెడ్డి పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు