సెల్‌టవరెక్కి ప్రియుడితో పెళ్లి జరిపించుకున్న యువతి

బుధవారం, 6 మార్చి 2019 (11:48 IST)
తనను ప్రేమించి మోసం చేసేందుకు ప్రయత్నించిన ప్రేమికుడితో ఆ యువతి పట్టుబట్టిమరీ వివాహం చేసుకుంది. తాను ప్రేమించిన ప్రియుడితో వివాహం జరిపించాలని పట్టుబట్టిన ఆ యువతి ఏకంగా సెల్ ‌టవర్‌కెక్కింది. దీంతో స్థానిక మహిళా సంఘాలు, పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ యువతికి ప్రేమికుడితో వివాహం జరిపించారు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో హసన్‌పర్తి మండలానికి చెందిన మాలిక హన్మకొండలోని ఓ నర్సింగ్‌ హోమ్‌లో కొన్నేళ్లుగా నర్సుగా పనిచేస్తోంది. అదే గ్రామానికి చెందిన మోషే అనే యువకుడితో ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలో అతనికి కొత్తగూడెం సింగరేణి సంస్థలో ఉద్యోగం వచ్చింది. అప్పటినుంచి పెళ్లి చేసుకోవాలంటూ యువతి.. ప్రియుడిపై ఒత్తిడి పెంచసాగింది. 
 
కానీ, అతను మాత్రం  మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మాలిక మంగళవారం తెల్లవారుజామున సెల్‌టవర్‌ ఎక్కి ప్రియుడితో పెళ్లి జరిపించాలని డిమాండ్‌ చేసింది. విషయం తెలుసుకున్న స్థానిక మహిళా సంఘాలు, పోలీసులు... అక్కడకు చేరుకున్నారు. ఆ తర్వాత ఆ యువతిని శాంతపరిచి కిందకు దించారు. పిమ్మట మోషేను పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి, కౌన్సెలింగ్‌ అనంతరం పెళ్లికి అంగీకరించాడు. ఆ తర్వాత పోలీసులే పెద్దలుగా వారిద్దరి పెళ్లి జరిగింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు