మండలి ఏం చేస్తుందో?

సోమవారం, 20 జనవరి 2020 (05:25 IST)
ఒక రాష్ట్రం.. మూడు రాజధానులు, ఒక హైకోర్టు, రెండు ప్రాంతాల్లో సీఎం క్యాంపు కార్యాలయాలు, రెండు చోట్ల అసెంబ్లీ సమావేశాలు.. ఇవీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్‌రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ నివేదిక సిఫారసులు చేసింది.

ముఖ్యమంత్రి జగన్‌ చేసిన ‘మూడు రాజధానుల’ ప్రకటనకు బాగా దగ్గరగా... ఆయా వ్యవస్థలను మరిన్ని ‘ముక్కలు’గా చేస్తూ కమిటీ తన నివేదిక సమర్పించింది. ఆ తర్వాత రాజధాని మార్పుపై ప్రభుత్వం బీసీజీ కమిటీని కూడా నియమించింది.

బీసీజీ కూడా జగన్‌కు నివేదిక ఇచ్చింది. దేశంలోని బహుళ రాజధానులు, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణపై నివేదికలో ప్రస్తావించారు. అయితే ఈ రెండు కమిటీలపై చర్చించేందుకు ఈనెల 20న అసెంబ్లీ, 21న శాసన మండలిని సమావేశపర్చాలని  ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. 

ఈ సమావేశాల్లో ప్రభుత్వం రాజధాని మార్పునకు సంబంధించి బిల్లును ప్రవేశ పెట్టనుందని ప్రచారం జరుగుతోంది. గతంలో అసెంబ్లీ ఆమోదించిన సీఆర్డీయే చట్టాన్ని రద్దు చేయడం లేదా కొన్ని సవరణలు ప్రతిపాదించవచ్చని అంటున్నారు.
 
అయితే రాజధాని మార్పునకు సంబంధించి ప్రభుత్వ వ్యూహానికి శాసనమండలి గండం పొంచి ఉంది. మండలిలో మెజారిటీ ఉన్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఈ బిల్లును అడ్డుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మండలిలో ఆధిక్యం ఉన్న పార్టీలకు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.

బిల్లును మరింత నిశిత పరిశీలనకు సెలెక్ట్‌ కమిటీకి పంపవచ్చు. ఆ పేరుతో ఏ నిర్ణయం తీసుకోకుండా నెల, రెండు నెలలు గడిపేయవచ్చు. లేదా ఆ బిల్లుకు సవరణలు ప్రతిపాదించి వెనక్కు అసెంబ్లీకి పంపవచ్చు. అసెంబ్లీ మరోసారి దాన్ని ఆమోదించి మండలికి పంపాల్సి ఉంటుంది.

అప్పుడు కూడా దానిపై నిర్ణయం తీసుకోవడానికి మండలికి నెల సమయం ఉంటుంది. రెండోసారి కూడా మండలి తిరస్కరిస్తే ఆ తర్వాత అసెంబ్లీ నిర్ణయమే ఫైనల్‌ అవుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు