కన్న తండ్రి చేయాల్సిన పని కట్టుకున్న భార్య చేసింది...

మంగళవారం, 29 అక్టోబరు 2019 (15:58 IST)
తలకొరివి పెట్టాల్సిన కొడుకే కట్టెలపై కళ్లముందు శవమై ఉన్నా కనీసం లేవలేని దుస్థితి ఆ తండ్రిది. కడుపున పుట్టిన బిడ్డలు ఉన్నా... తలకొరివి పెట్టే వయసు వారికి లేదు. దీంతో జీవితాంతం తోడుగా ఉంటానని చేతిలో చెయ్యేసి బాసచేసి అర్ధాంతరంగా తనను విడిచి వెళ్లిపోయిన భర్త చితికి ఆ ఇల్లాలు అంత్యక్రియలు నిర్వహించింది. 
 
ఓ వైపు తండ్రి ... మరోవైపు వారసులు పోషించాల్సిన పాత్రను అన్నీ తానై భర్త చితికి నిప్పుపెట్టింది. సిక్కోలు జిల్లా మర్లపాడులో చోటుచేసుకుందీ హృదయ విదారకరమైన ఘటన. 
దేశరక్షణలో సేవలందిస్తూ... ప్రాణాంతక వ్యాధితో పోరాడి తుదిశ్వాస విడిచిన సిక్కోలుకు చెందిన జవాన్ బతకల దానయ్య అంతిమయాత్ర విషాదంగా మారింది. 
 
నందిగాం మండలం మర్లపాడు గ్రామానికి చెందిన బతకల దానయ్య, పంజాబ్ రాష్ట్రం అబోహర్లో హవాలాదార్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఐతే కొద్ది నెలల క్రితం ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడటంతో మూడు నెలలుగా కోల్‌కతా ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల (ఆదివారం) క్రితం మరణించాడు. మృతదేహాన్ని సోమవారం స్వగ్రామం మర్లపాడుకు తీసుకువచ్చిన అనంతరం భారీగా ఊరేగింపుగా అంతిమయాత్ర నిర్వహించారు. 
 
ఎప్పుడూ అందరితో సరదాగా ఉండే దానయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున అంతిమయాత్రలో పాల్గొన్నారు. దానయ్య మృతదేహంపై జాతీయజెండాను కప్పి గౌరవ సూచికంగా నేవీ , ఆర్మీ సిబ్బంది మూడుసార్లు గాలిలో కాల్పులు జరిపి వీడ్కోలు పలికారు. ఐతే దానయ్య తండ్రి అనారోగ్యంతో మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఉన్నారు. దానయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నా వారు చిన్నపిల్లలు కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వివాహబంధంతో ఏడడుగులు వేసిన దానయ్య భార్య శారద... తన భర్త చితికి నిప్పంటించి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన స్థానికంగా హృదయవిధారకంగా మారింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు