పల్నాడు జిల్లా తొండపిలో రెచ్చిపోయిన వైకాపా మూకలు.. మాజీ మంత్రి కన్నా హత్యకు కుట్ర!!?

వరుణ్

సోమవారం, 29 జనవరి 2024 (09:29 IST)
పల్నాడు జిల్లాలో అధికార వైకాపా మూకలు మరోమారు రెచ్చిపోయారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ప్రచార కార్యక్రమంపై దాడికి తెగబడ్డారు. వీధిలైట్లు ఆపేసి... ఆయనపై రాళ్లదాడి చేశారు. ఈ దాడి నుంచి ఆయన తృటిలో ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. 
 
పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపిలో కన్నా లక్ష్మీనారాయణ "బాబు ష్యూరిటీ - భవిష్యత్‌కు గ్యారెంటీ"పై ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకోసం ఆయన పార్టీ నేతలతో కలిసి ప్రచారం చేస్తున్నారు. ఆ సమయంలో వైకాపా మూకలు ఒక్కసారిగా పెట్రేగిపోయారు. వీధిలైట్లు ఆపేసి రాళ్ల దాడికి పాల్పడ్డారు. 
 
సమీపంలో ఉన్న భవనాల పైకప్పు నుంచి ఒక్కసారిగా రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో కన్నా లక్ష్మీనారాయణ పీఏ స్వామితో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ కార్యక్రమానికి బందోబస్తుగా వచ్చిన పోలీసులు సైతం తమకేం పట్టనట్టుగా, ఏమీ కనిపించనట్టుగా నిస్సహాయుల్లా చూస్తూ మిన్నకుండిపోయారు. 
 
మరోవైపు తొండపిలో సోమవారం టీడీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా కన్నా లక్ష్మీ నారాయణ పాల్గొనాల్సివుంది. కానీ, దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. దాడి నేపథ్యంలో సదరు కార్యక్రమాలకు కన్నా హాజరవుతారా? లేదా? అన్నది తెలియడం లేదు. ప్రస్తుతం తొండపిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 
 
కన్నా లక్ష్మీనారాయణ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఈ స్థానం నుంచి మంత్రి అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. నియోజకవర్గంలో తనకు పోటీ ఉండరాదన్న అక్కసుతో మంత్రి అంబటి రాంబాబు అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు