వైకాపా ఎమ్మెల్యేను గెలిపించినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నా: మాజీమంత్రి కొత్తపల్లి, సస్పెండ్

బుధవారం, 1 జూన్ 2022 (22:21 IST)
గత ఎన్నికల్లో నరసాపురం నియోజకవర్గం నుంచి వైకాపా నుంచి పోటీ చేసిన ప్రసాదు రాజును గెలిపించి తప్పు చేసానంటూ నిన్న మీడియా సమావేశంలో మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు చెప్పుతో కొట్టుకున్నారు. దీనితో వైకాపా అధిష్టానం సీరియస్ అయ్యింది. ఫలితంగా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసారు.

 
కాగా కొత్తపల్లి గత కొన్నిరోజులుగా వైకాపాకి వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో తనకు పార్టీ టిక్కెట్ ఇవ్వకపోయినా సొంతగా పోటీ చేస్తాననీ, తనకు క్యాడర్ వుందన్నారు. పార్టీలతో తనకు సంబంధం లేదనీ, ప్రజా మద్దతు తనకు వుందన్నారు. 2019 ఎన్నికల్లో తప్ప తన రాజకీయ చరిత్రలో అన్నిసార్లు పోటీ చేసిన అనుభవం వుందన్నారు.

 
ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపిగా తనకు నియోజకవర్గ ప్రజలతో మంచి సంబంధాలున్నాయన్నారు. నరసాపురం జిల్లా కేంద్రం అవుతుందన్న నమ్మకంతో ప్రసాదరాజును గెలిపించుకున్నామనీ, జిల్లా కేంద్రాన్ని సాధించడంలో ప్రసాద్ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు.

 
మరోవైపు కొత్తపల్లి చర్యలపై పేర్ని నాని మండిపడ్డారు. పార్టీలు మారేటపుడు కొత్తపల్లికి చెప్పులతో కొట్టుకోవడం అలవాటు అని సెటైర్లు వేసారు. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు