అమిత్ షా దర్శనం కోసం ఢిల్లీకి జగన్... ఒక్క రోజు గ్యాప్‌లో రెండోసారి...

గురువారం, 13 ఫిబ్రవరి 2020 (16:02 IST)
ఒక్క రోజు గ్యాప్‌లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. బుధవారం హస్తినకు వెళ్లిన ఆయన... ప్రధాని నరేంద్ర మోడీతో అరగంట పాటు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. 
 
ఇపుడు అంటే శుక్రవారం మరోమారు ఢిల్లీకి వెళ్లనున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ కానున్నారు. భేటీలో భాగంగా మూడు రాజధానులు, రాష్ట్ర విభజన సమస్యలు, పోలవరం నిధులు, శాసనమండలి రద్దు తీర్మానంతో పాటు పలు విషయాలపై నిశితంగా చర్చించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 
 
అయితే.. ఒక్క రోజు గ్యాప్‌లోనే రెండోసారి జగన్ ఢిల్లీలో పర్యటించడంతో ఏపీ రాజకీయాల్లో సర్వ్రతా చర్చనీయాంశమైంది. మరోవైపు ఈ వరుస పర్యటనలపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
 
అయితే, బుధవారం మోడీతో జరిగిన భేటీలో ఆయన ముందు అనేక విషయాలను ప్రస్తావించారు. కానీ, పరిష్కారం కోసం ప్రధాని మోడీ ఎలాంటి హామీ ఇవ్వలేదు కదా, హోం మంత్రి అమిత్ షాను కలవాలని సూచించారు. దీంతో బుధవారం, గురువారం నాడు షా బిజిబిజీగా ఉండటంతో అపాయిట్మెంట్ దొరకలేదని తెలుస్తోంది. 
 
శుక్రవారం నాడు షా అపాయిట్మెంట్ దొరికిందని.. ఆయనతో జగన్ భేటీ అయ్యి అన్ని విషయాలను చర్చిస్తారని సమాచారం. జగన్ వెంట విజయసాయి రెడ్డి, ఏపీకి చెందిన ఇద్దరు మంత్రులు కూడా ఢిల్లీ వెళ్తారని తెలుస్తోంది. అయితే ఈ పర్యటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు