ఆ బాధ్యత కేంద్రానిదే : సీఎం జగన్మోహన్ రెడ్డి

ఆదివారం, 25 అక్టోబరు 2020 (12:52 IST)
జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్టు నిర్మాణానికి 2014 అంచనాల ప్రకారం రూ.20,398 కోట్లు మాత్రమే ఇరిగేషన్ కాంపోనెంట్​గా చెల్లిస్తామని కేంద్రం చెబుతుండటంపై రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేస్తోంది. 
 
ప్రాజెక్టు రెండో డీపీఆర్‌పై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం పంపిన అంచనాలు, కేంద్రం ఇస్తామన్న నిధులపై సంబంధిత అధికారులతో చర్చించారు. 2014 అంచనాల ప్రకారం రూ.20,398.61 కోట్లే ఇస్తామని దీనికి అంగీకరించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)ని కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. 
 
రూ.55,448.87 కోట్లతో రూపొందించిన రెండో డీపీఆర్‌కు ఆథారిటీ, కేంద్ర జలసంఘం ఆమోదం తెలిపాయి. దీనిలో రూ.47,725.74 కోట్లకు రివైజ్డ్‌‌ కాస్ట్‌ కమిటీ, కేంద్ర జల్‌శక్తిశాఖ ఆమోదం ఉంది. రెండో డీపీఆర్‌ ఆమోదించాలని ఆర్థికశాఖను జల్‌శక్తి శాఖ కోరిందని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. 
 
భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌కు రూ.29 వేల కోట్లు కావాలని అధికారులు అంచనా వేశారు. 2014 అంచనా ప్రకారం రూ.20,398.61 కోట్లు చెల్లిస్తే ప్రాజెక్టు పూర్తి చేయడం అసాధ్యమన్నారు. జాతీయ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత కేంద్రంపైనే ఉందని జగన్ అన్నారు‌. విభజన చట్టం, కేంద్ర కేబినెట్‌ నిర్ణయం దాన్నే అంగీకరిస్తుందన్నారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు మాత్రమే చూస్తోందని, ప్రాజెక్టు పర్యవేక్షణ అంతా పీపీఏ చూస్తోందన్నారు. ఈ అంశాలను కేంద్ర దృష్టికి తీసుకెళ్లాలని, సీడబ్ల్యూసీ, రివైజ్డ్‌‌ కాస్ట్‌ కమిటీ ఆమోదించిన అంచనాల అమలుకు కృషి చేయాలని సీఎం జగన్ అధికారులను‌ ఆదేశించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు